Intercity express: సికింద్రాబాద్ టు గుంటూరు బయల్దేరిన ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ లో హఠాత్తుగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ట్రైన్ జనగామ స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా, ట్రైన్ లోని బోగీల నుంచి పొగ రావడం గమనించిన సిబ్బంది లోకో పైలెట్ కు వెంటనే సమాచారం అందించారు.
దీంతో లోకోపైలెట్ రైలును జనగామ స్టేషన్ దగ్గర నిలిపివేశారు. ఇక అగ్నిప్రమాదం సంభవించిందని భావించిన ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో వణికిపోతూ.. బోగీల నుంచి దిగి పరుగులు పెట్టారు. అయితే రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని మరమ్మత్తులు చేసింది. తరువాత ట్రైన్ అక్కడి నుంచి బయల్దేరింది.
అయితే పొగలు ఎందుకు వచ్చాయన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ మధ్య కాలంలో రైల్వే ప్రమాదాలు సర్వసాధారణంగా మారుతున్నాయి. మరోవైపు వరుస రైల్వే ప్రమాదాలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.