జవహార్ నగర్ మహిళ వివస్త్ర ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. హైదరాబాద్ శాంతి భద్రతలపై ఆందోళనను రేకెత్తిస్తోంది. ఇక ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. వారంలోపు ఈ ఘటనపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని కమిషన్ ఆదేశించింది.
కాగా,ఈ నెల 5న జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ బస్ స్టాండ్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్న ఒక యువతి పై పెద్ద మారయ్య అనే కూలి పని చేసే వ్యక్తి ఒక్కసారిగా దాడికి దిగాడు. ఆమె బట్టలను మొత్తం చింపేసి వివస్త్రను చేశాడు. అది చూసిన మరో మహిళ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆ మహిళపై కూడా దాడికి యత్నించాడు మారయ్య.
మహిళను బట్టలు విప్పి ఆమెను వివస్త్రను చేసి రోడ్డుపై నిలబెట్టి నానా రచ్చ చేశాడు. అక్కడున్న వారికి ఏం చేయాలో అర్థం కాక నిలబడి చూస్తూ ఉండిపోయారు. దాదాపుగా 15 నిమిషాల పాటు ఆ యువతి రోడ్డు మీద నగ్నంగా ఉన్నా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరికి తప్ప తాగి మైకంలో ఉన్న ఆ కీచకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తరువాత అక్కడున్న వారు కవర్లు కప్పి పోలీసులకు సమాచారమిచ్చారు.
వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమెకు రక్షణ కల్పించి నిందితుడు మారయ్యను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. అయితే మణిపూర్ ఘటన మర్చిపోక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం దారుణం. దీంతో సీరియస్ అయిన జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ డీజీపి అంజనీ కుమార్ ను వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.