AP Floods 2023: ఏపీలో విస్తారంగా వర్షాలు...ఆ జిల్లాలకు భారీ వర్షసూచన

ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని ఏపీ ఐఎండీ ప్రకటించింది. ఐఎండీ అంచనా ప్రకారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరం ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

New Update
AP Floods 2023: ఏపీలో విస్తారంగా వర్షాలు...ఆ జిల్లాలకు భారీ వర్షసూచన

ఏపీలోని ఆయా జిల్లాలకు వర్షసూచన

ఉరుములతో కూడిన వర్షం కురిసినప్పుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని అధికారులు సూచించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో బుధవారం అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, గుంటూరు పల్నాడు, బాపట్ల జిల్లాల్లో గురువారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో గురువారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేస్తోంది. కాగా, ఇది 24వ తేదీ లోపు ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు రుతుపవన ద్రోణి రాజస్థాన్‌లోని బికనీర్‌ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు పయనిస్తోంది. ఈ ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీనివల్ల వచ్చే నెల 3వ తేదీ వరకు వర్షాలకు ఆస్కారముంది.

నేడు గోదావరికి పెరగనున్న వరద ఉధృతి

ఏపీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎగువ ప్రాంతాల్లో గోదావరి ఉద్ధృతి స్వల్పంగా పెరుగుతోంది. ఆ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ బ్యారేజీ వద్ద నది వరద గురువారం నాటికి పెరిగే ఛాన్స్‌ ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువనున్న లక్ష్మి బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. దీని ప్రభావం ధవళేశ్వరం వద్ద కనిపించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాటన్‌ బ్యారేజీ వద్ద నీటిమట్టం మంగళవారం 9.55 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 51,268 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు