/rtv/media/media_files/2025/09/26/brs-jubilee-hills-candidate-2025-09-26-12-31-56.jpg)
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే.. జూన్ 8న అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి, గోపినాథ్ సోదరుడు వజ్రానాథ్, గోపినాథ్ సతీమణి సునీత తదితరులు టికెట్ రేసులో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొదటి నుంచి గోపినాథ్ సతీమణి సునీతకే టికెట్ ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రకటించారు.
— BRS Party (@BRSparty) September 26, 2025
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణంతో, త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో.. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన… pic.twitter.com/nYGznPYvrk
ఈ నేపథ్యంలో నేడు సునీత పేరును ఫైనల్ చేస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల మొదటి వారంలో ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ముందుగానే అభ్యర్థిని ప్రకటిస్తే ప్రచారం ప్రారంభించవచ్చన్న వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. డివిజన్ల వారీగా సమావేశాలను నిర్వహిస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు?
అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ఇక్కడ విజయం సాధించి హైదరాబాద్ లో బలం పెంచుకోవాలని భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించి రాష్ట్రంలో తమకు తిరుగులేదని చాటాలని ఆపార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మేయర్ విజయలక్ష్మి జూబ్లీహిల్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. మరో వారంలో ఆ పార్టీ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉంది.
గత ఎన్నికల్లో అజారుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. ఈ సారి కూడా టికెట్ తనకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఆఫర్ చేసి రేసు నుంచి తప్పించింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో బీసీలకు ఈ సారి ఇక్కడ టికెట్ ఇవ్వాలన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. నవీన్ యాదవ్, కంజర్ల విజయలక్ష్మి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు కాంగ్రెస్ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కూడా రేసులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వీరిలో ఎవరు టికెట్ దక్కించుకుంటారన్న అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.