/rtv/media/media_files/2025/09/13/congress-2025-09-13-19-45-45.jpg)
సూర్యాపేట జిల్లాలోని కోదాడ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికల ట్రెండ్కు అనుగుణంగానే ఇక్కడ కూడా హస్తం హవా స్పష్టంగా కనిపించింది. కోదాడ మున్సిపాలిటీలోని మొత్తం 35 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుని మున్సిపాలిటీపై తన జెండాను ఎగురవేసింది. 35 వార్డులకు గానూ ఏకంగా 27 వార్డులను దక్కించుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని బలం చేకూరింది.
భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీలు
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కేవలం 3 వార్డులకే పరిమితం కాగా, ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ వార్డుల్లో సత్తా చాటారు. ఈ భారీ విజయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వానికి ఓటర్లు వేసిన ముద్ర అని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.గెలిచిన అభ్యర్థులు, కార్యకర్తలు కోదాడ పట్టణంలో భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తూ సంబరాల్లో మునిగిపోయారు.
మరోవైపు నారాయణపేట జిల్లాలో కొత్తగా ఏర్పడిన మద్దూరు మున్సిపాలిటీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి హోరాహోరీగా సాగిన పోరులో చివరకు కాంగ్రెస్ అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 16 స్థానాలకు గానూ 9 వార్డులను దక్కించుకోవడంతో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించేందుకు కాంగ్రెస్కు స్పష్టమైన మార్గం ఏర్పడింది. బీఆర్ఎస్ అభ్యర్థులు 6 వార్డుల్లో గెలిచి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, అధికార పీఠానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేకపోయారు.
Follow Us