/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-30T210947.129.jpg)
MLA Harish Rao: సాగుకు పెట్టుబడి సాయం అందించి రైతన్నకు భరోసా కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా బంధు పెట్టే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెర లేపడం సిగ్గు చేటు అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతుబంధు కంటే సన్నాలకిచ్చే రూ. 500 బోనసే మేలు అంటూ, రైతులు చెబుతున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం శోచనీయం అని అన్నారు. ప్రపంచంలో రైతుకు పెట్టుబడి సాయం అందించిన ఏకైక పథకం రైతుబంధు అని ఐక్యరాజ్య సమితి సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు. అలాంటి గొప్ప పథకాన్ని ఒక ప్రణాళిక ప్రకారం రూపుమాపే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గం.
సగం మందికి మొండి చేయి....
హరీష్ రావు ట్విట్టర్ లో.. "రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ సుమారు రూ. 26 కోట్లు మాత్రమే. అదే రైతుబంధు కింద ఏడాదికి రూ. 7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. మీరు మ్యానిఫెస్టోలో చెప్పినట్లు ఎకరాకు రూ. 15,000 చెల్లిస్తే ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. మరి రైతు బంధు కంటే, బోనస్ అందించడం రైతులకు మేలు ఎట్లవుతుందో వ్యవసాయ మంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.
అధికారంలోకి రాగానే రుణమాఫీ సగం మందికి చేసి, సగం మందికి మొండి చేయి చూపారు. ఆ తర్వాత అన్ని పంటలకు బోనస్ అని, చివరకు సన్నాళ్లకు మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు రైతుబంధును శాశ్వతంగా రద్దు చేసే ప్రయత్నం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుబంధును బందు చేస్తారని కేసీఆర్ గారు ముందే హెచ్చరించారు. అనుకున్నట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. రైతు భరోసా వస్తదని ఎదురుచూస్తున్న రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు మోసపోయినట్లేనా?, రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్ రెడ్డి?, మేనిఫెస్టోలో చెప్పి, రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా రేవంత్ రెడ్డి?
రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ గారు తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నేడు మహబూబ్ నగర్ లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న వానకాలం రైతుబంధు తో పాటు, యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం." అని రాసుకొచ్చారు.