Municipal Elections Polling: ఓటేసిన ప్రముఖులు.. ఎవరెవరు ఎక్కడంటే?

తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు కూడా క్యూ లైన్‌లో నిలబడి వారి ఓటు వేస్తున్నారు.

New Update
polling

తెలంగాణలో నేడు 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్‌ కార్పొరేషన్ల రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్లు నిర్వహిస్తోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు కూడా క్యూ లైన్‌లో నిలబడి వారి ఓటు వేస్తున్నారు.

ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కొడంగల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడానికి ఆయన బుధవారం హైదరాబాద్ నుంచి కొడంగల్ హెలికాప్టర్ లో వెళ్లారు. స్టానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఆయన ఓటు వేశారు. సీఎం రాకతో కొడంగల్‌లో సందడి నెలకొంది.

వరుసలో నిలబడి ఓటు వేసిన కలెక్టర్

వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం మర్రికుంటలోని 9వ వార్డు పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే చేరుకుని సామాన్యుడిలా వరుసలో నిలబడటం విశేషం. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన ఆయుధమని, ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ చొరవను స్థానికులు అభినందించారు.

ఓటేసిన డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. పట్టణ ప్రాంతాల అభివృద్ధిలో ఓటు కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఫ్యామిలీతో కలిసి ఓటేసిన మంత్రి పొన్నం

మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి హుస్నాబాద్‌లోని నవ భారత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు.  

సూర్యాపేటలో ఓటేసిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక 44వ వార్డులోని సిద్ధార్థ హైస్కూల్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. 

ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ డీకే అరుణ

మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 22వ డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీలో ఉన్న ప్రతిభ కాలేజ్ పోలింగ్ బూత్‌లో ఆమె ఓటు వేశారు.

క్యూలో నిలబడి ఓటేసిన మాజీ మంత్రి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీనివాస కాలనీలోని గీతం హై స్కూల్లో సామాన్యుడిలా క్యూ లైన్లో నిలబడి ఓటేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఓటు వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుండటంతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్గొండలోని పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని కోమటిరెడ్డి ఓటు వేశారు. 

ఓటు హక్కు వినియోగించుకున్న టీపీసీసీ చీఫ్

నిజామాబాద్‌ నగరంలోని సన్‌ఫ్లవర్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా సాధారణ పౌరుడిలా క్యూలైన్‌లో నిలబడి ఆయన ఓటు వేశారు. 

ఓటు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తన ఓటు హక్కును కరీంనగర్‌లో వినియోగించుకున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 50వ డివిజన్‌ పరిధిలోని జ్యోతినగర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి సామాన్య పౌరుడిలా క్యూలైన్‌లో నిల్చోని ఓటు వేశారు.

Advertisment
తాజా కథనాలు