1981 Indravelli massacre : ఇంద్రవెల్లి ఘటన స్ఫూర్తితో....

ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 45 ఏళ్లు. ఏప్రిల్ 20,1981 నఆదిలాబాద్ ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రోజు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో రైతు కూలీ సంఘం' సమావేశం నిర్వహించింది. ఆ క్రమంలో జరిపిన కాల్పుల్లో పలువురు ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు

New Update
Indervelly

Indervelly

1981 Indravelli massacre : ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 45 ఏళ్లు. ఇది ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’ కథగా చెప్పుకొంటారు. ఏప్రిల్ 20,1981వ సంవత్సరం ఆదిలాబాద్ ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రోజు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో ఓవైపు సంత జరుగుతోంది. ఈ సంతలో సరుకులు కొనడానికి జనం వస్తే ...మరోవైపు గిరిజన రైతు కూలీ సంఘం' సమావేశానికి జనం వస్తున్నారు. సభకు అనుమతి లేదని పోలీసులకు, ప్రజలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ క్రమంలో జరిపిన కాల్పుల్లో 13 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు(అధికారిక లెక్కల ప్రకారం). అనేక మంది గాయపడ్డారు. అయితే, ఆ సంఖ్య ఎంత అనేది స్పష్టంగా తెలియదు. స్థానిక ఆదివాసీలు ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలను కథలు కథలుగా వినిపిస్తారు. ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల ఘటనను యావద్దేశం ముక్త కంఠంతో ఖండించింది. కాల్పుల ఘటనతో కుగ్రామంగా ఉన్న ఇంద్రవెల్లి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రతిపక్షాలు, ప్రజాహక్కుల సంఘాలు, సాహితీలోకం 'స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్' అంటూ నిరసించింది. 

కుమ్రం భీమ్ నుంచి ఇంద్రవెల్లి వరకు

కుమ్రం భీమ్ ఆధ్వర్యంలో ఆదివాసీలు సాగించిన 'జోడేన్ ఘాట్'ను నిజాం అణచివేశాడు. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపట్టింది. ఆదివాసీల తిరుగుబాటు మూలాలపై మానవ పరిణామ శాస్త్రవేత్త 'హేమాన్ డార్ఫ్' అధ్యయనం చేసి ఆయన సూచనల మేరకు సుమారు లక్షన్నర ఎకరాల అటవీ పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు. ఆదివాసీలను అక్షరాస్యులగా చేసేందుకు ప్రత్యేక స్కూళ్లు, వృత్తి శిక్షణ కేంద్రాలు తెరిచారు. గిరిజన తెగలు, ప్రాంతాలను నోటిఫైడ్ ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. కేస్లాపూర్ నాగోబా జాతర వేదికగా ఆదివాసీల సమస్యలు, ఆర్జీలను పరిష్కరించేందుకు 'దర్బార్'ను ప్రారంభించారు. బయటి ప్రాంత వ్యక్తులపై ఆంక్షలు విధించింది. ఈ చర్యలతో ఆదివాసీలకు కాస్త ఉపశమనం దొరికింది.

ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయ్యింది. ఆదివాసీ ప్రాంతాలను రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లో చేర్చారు. అనంతరం రాజ్యాంగబద్ధమైన చట్టాలను తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలకు రక్షణ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ (షెడ్యూల్ ప్రాంతం) భూమి బదలాయింపు చట్టం -1959 తీసుకువచ్చారు. దీనికి 1970 సంవత్సరంలో మార్పులు చేశారు. దీన్నే 1/70 ( వన్ ఆఫ్ సెవంటీ) చట్టంగా పిలిచారు. ఈ రకంగా పకడ్బందీ చట్టాలు వచ్చినా... అందులోని లోపాలతో  పెద్ద విస్తీర్ణంలో ఆదివాసీల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అంతేకాకుండా 1971 నాటికి గుడిహత్నూర్, ఆసిఫాబాద్, కరీంనగర్, నిర్మల్ ప్రాంతాలను కలుపుతూ రోడ్డు సౌకర్యం ఏర్పడి బయటి వ్యక్తుల రాకపోకలు పెరిగాయి. దీంతో ఈ ప్రాంతానికి వలసలు పెరిగాయి.

వడ్డీ వ్యాపారులు క్రమంగా ఆ ప్రాంతాల్లో బలపడ్డారు. ఆదివాసులుగా గుర్తించని బంజారా/లంబాడాల చేతుల్లోకి భూమి, అధికారాలు మారుతుండటంతో గోండ్ ఆదివాసీల ప్రాబల్యం రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. ఇలా జీవనాధారమైన భూములు, పుట్టిన ప్రాంతంలోనే తమ అస్తిత్వం అన్యాక్రాంతం కావడం ఇంద్రవెల్లి పోరాటానికి కారణమైంది . ఈ క్రమంలో 1983లో ఇంద్రవెల్లి కాల్పులు జరిగిన ప్రాంతంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలో భాగంగా అమరవీరుల స్థూపం నిర్మించారు. అక్కడి ప్రజలకు కొన్ని మౌలిక సదుపాయాలను కల్పించింది. ప్రతి ఏటా ఏప్రిల్ 20న పెద్ద ఎత్తున అక్కడి ఆదివాసుల ఏకమై స్మరించుకోవడం జరుగుతుంది. 

భూ పోరాటం కొనసాగింపు... లక్ష కిలోమీటర్ల రథయాత్ర

ఇంద్రవెల్లి ఘటనకు 45 ఏళ్లు గడిచిన...అక్కడి ప్రజల జీవితాలలో ఆశించిన పురోగతి లేదు. నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు ఇంకా అందరికీ అందుబాటులో లేదు. ఉపాధి లేక కూలీలుగా జీవితాలను వెల్లదీస్తున్నారు. భౌతిక పురోగతే తప్ప, ప్రజల జీవన ప్రమాణాలలో మెరుగుదల అంతంత మాత్రమే. ఆదివాసీ తెగల అస్తిత్వ పోరు ఆగడం లేదు. ఆదివాసీల భూసమస్యలు చాలా వరకు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. అదే సందర్భంలో ఆదివాసీలు, లంబాడ గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం  కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ ల ఉప వర్గీకరణ సబబే అని తీర్పునివ్వడం జరిగింది. వీరిలో కూడా అంతర్గత అంతరాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

దీంతో జనాభా ప్రాతిపదికన వారికి విద్యా, ఉద్యోగాల్లో వారి రిజర్వేషన్ లలో ఉప వర్గీకరణను వర్తింపచేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఉప వర్గీకరణ చట్టం  తెచ్చాయి. ఎస్టీలలో కూడా ఉపవర్గీకరణ జరగాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే సమాన అవకాశాలు లభిస్తాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన బీసీ, ఎస్సీ, ఎస్టీలలో మెజార్టీ ప్రజల చేతిలో భూమి లేదు. వారికి ఈ రాజ్యంలో వాటా లేదు. అన్ని రంగాల్లో వారు వెనుకబడ్డారు. అగ్రవర్ణ పెత్తందారుల ఆధిపత్యమే కొనసాగుతుంది.

 

ఈ నేపథ్యంలో ఇటీవల బీసీ,ఎస్సీ, ఎస్టీ హక్కులు, రాజ్యాధికార జేఏసీ మరియు ధర్మ సమాజ పార్టీ ఆధ్వర్యంలో "మాభూమి" పేరుతో లక్ష కిలోమీటర్ల రథయాత్ర కార్యక్రమం అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైనది. దీన్నీ డాక్టర్ విశారదన్ మహారాజు ఏప్రిల్ 14, 2025 అంబేద్కర్ జయంతి రోజున శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం కూడా ఆనాడు కొమురం భీమ్ సాగించిన భూ పోరాటం మరియు సామాజిక సమస్యల పరిష్కారం దిశగానే కొనసాగుతుంది. 

(ఇంద్రవెల్లి ఘటనకు 45 ఏళ్లు సందర్భంగా..)


- సంపతి రమేష్ మహారాజ్, సామాజిక విశ్లేషణకులు,7989578428

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు