మనం ఎక్కడికి వెళ్లాలన్నా.. ఏది కొనాలన్నా.. ఇంతకు ముందులా జేబులో మనీ సర్దుకొని వెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతా క్యాష్ లెస్ పేమెంట్స్ నడుస్తున్నాయి కాబట్టి. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మన బ్యాంక్ వివరాలను సెల్ ఫోన్ నెంబర్కు అటాచ్ చేసుకోవాలి. అన్ని పేమెంట్స్ ఫోన్ ద్వారానే జరిగిపోతాయి. ఆటోలో వెళ్లాలన్నా, హోటల్ లో ఏదైనా తినాలన్నా, టీ తాగాలన్నా, షాపింగ్ చేయాలన్నా ఇలా అన్నింటికీ నగదు రహిత లావాదేవీలు అమలులోకి వచ్చాయి.
కరెంట్ బిల్లు కట్టాలన్నా, బ్యాంక్ నుండి నగదు ఇతరులకు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా ఇలా అన్ని రకాల చెల్లింపులకు ప్రభుత్వ సంస్థలు కూడా ఆన్లైన్ పేమెంట్స్ కే మొగ్గుచూపుతున్నాయి. దీని ద్వారా సమయం సేవ్ అవుతుంది. చిల్లర గొడవ ఉండదు. కరోనా సమయం నుండి నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా పెరిగాయి. తాజాగా టీఎస్ ఆర్టీసీ కూడా సిటీ బస్సుల్లో క్యాష్లెస్ లావాదేవీలను తీసుకురానున్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో నడిచే సిటీ లోకల్ బస్సుల్లో యూపీఐ పేమెంట్స్ః
యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక అందరు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కే మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వ సంస్థలు కూడా క్యాష్లెస్ సేవలను అందిస్తున్నాయి. రవాణా రంగంలో కూడా యూపీఐ సేవలను తీసుకొచ్చారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీలో కూడా నగదు రహిత ట్రాన్సాక్షన్స్ను తీసుకురానున్నారు. నిత్యం గ్రేటర్ హైదరాబాద్లో నడిచే సిటీ లోకల్ బస్సుల్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ అమలులోకి తేనున్నారు.ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా టికెట్లు జారీ చేసే విధంగా తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది.
ఈ సంవత్సరం చివరికల్లా సిటీ బస్సుల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత సంవత్సరం నుంచే నగదు రహిత లావాదేవీలను అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పటికే దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఫోన్ పే క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లను కొనుగోలు చేసే అవకాశం అధికారులు కల్పించారు. ఇదే విధంగా సిటీ బస్సుల్లో కూడా అమలులోకి తీవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.