తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో తన రెండో రోజు పర్యటనను కొనసాగిస్తున్నారు.రెండో రోజు తన పర్యటనలో భాగంగా... మంగళవారం తెల్లవారుజామున షోలాపూర్ నుంచి పండరీపూర్ చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీవిట్టల్ పండరీపూర్లోని రుక్మిణి ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీస్సులు, తీర్ధ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం దేవాలయ ఈవో సీఎం కేసీఆర్ని శాలువాతో సత్కరించారు.
కేసీఆర్కు శ్రీవిట్టల్ రుక్మణి విగ్రహాన్ని బహూకరించిన భక్తుడు
దేశంలోని రైతులందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా ఓ భక్తుడు కేసీఆర్కు శ్రీవిట్టల్ రుక్మణి విగ్రహాన్ని తనకు బహూకరించారు. దీంతో కేసీఆర్ విగ్రహాన్ని స్వీకరించారు. అయితే సీఎం కేసీఆర్ వెంట ముఖ్యనేతలు బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్రావు, డీ దామోదర్రావు, పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా మహారాష్ట్రలోని ముఖ్యమైన పలు దేవాలయాలను సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు.
ఘనస్వాగతం పలికిన ఆలయ సిబ్బంది
ఆలయానికి సీఎం వచ్చిన సందర్భంగా ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. పలువురు మరాఠీ భక్తులు సీఎంను చూసేందుకు ఉత్సాహం చూపారు. ప్రత్యేక పూజల అనంతరం సమీపంలోని గ్రామంలోని పార్టీ కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు. అక్కడ స్థానిక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు శక్తిపీఠం తుల్జాపూర్ భవానీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్రలోని భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు పెద్ద ఎత్తున పండరీపురం చేరుకున్నారు. కాగా, సీఎం కేసీఆర్ సోమవారం హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలో భారీ ర్యాలీగా బయలుదేరారు. రాత్రి షోలాపూర్ లో బస చేసి.. ఈ ఉదయం పండరీపూర్ వెళ్లారు. కేసీఆర్ తదితరులు ఆలయ ఉత్తర ద్వారం గుండా లోనికి ప్రవేశించారు. కేసీఆర్ దుకాణాల మధ్య నడిచి ప్రజలకు అభివాదం చేశారు.