Telangana Elections: రైతుల చుట్టే తెలంగాణ ఎలక్షన్స్.. ఎవరికి పట్టం కట్టేనో మరి..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులే ఆయా పార్టీల గెలుపోటములు నిర్ణయించనున్నారు. అందుకే ప్రధాన పార్టీలన్నీ రైతులే లక్ష్యంగా ఎన్నికల హామీలు ప్రకటిస్తున్నాయి. రైతులను ప్రసన్నం చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నాయి.

New Update
Telangana Elections: రైతుల చుట్టే తెలంగాణ ఎలక్షన్స్.. ఎవరికి పట్టం కట్టేనో మరి..!

Telangana Elections: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత మూడవ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, ఈ ఎన్నికలు.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా సాగుతున్నాయి. రెండు దఫాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. సరికొత్త సంక్షేమ పథకాలు, ప్రజాకర్షక హామీలతో ఓటర్లను తమవైపు లాగే ప్రయత్నం చేస్తుంది. ఈ మేరకు ప్రచార పర్వం సాగిస్తోంది. అదే సమయంలో.. బీఆర్ఎస్‌కు ధీటైన పోటీ ఇస్తోంది కాంగ్రెస్. ఏదైతే సంక్షేమం పేరుతో బీఆర్ఎస్ పై చేయి సాధిస్తుందో.. అవే సంక్షేమ పథకాలతో ఎన్నికల కథన రంగంలోకి దూసుకెళ్తుంది. మార్పు రావాలని, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓటర్లకు గాలం వేస్తోంది. ఇక బీజేపీ సైతం తానేం తక్కువగా అంటూ ప్రజలపై ఎన్నికల వరాలు గుప్పిస్తోంది. ఎవరి హామీలు ఎలా ఉన్నా? ఏ పార్టీ మేనిఫెస్టోలో ఏ అంశాలు పేర్కొన్నా.. జనం ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనేదే ఇప్పుడు తెలంగాణలో ప్రధాన చర్చ.

మూడోసారి అధికారం తమదేనంటూ బీఆర్ఎస్ పూర్తి విశ్వాసంలో ఉండటానికి కారణం.. రైతులు తమవైపు ఉన్నారనే ధైర్యం. అదే సమయంలో ఫించన్ దారులు సైతం తమకే ఓటు వేస్తారని, ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారులు తమకే ఓటు వేస్తారనే విశ్వాసంతో ఉంది. ఆ కారణంగానే బీఆర్ఎస్‌లో అధికారంపై ధీమా ఉంది. పదేళ్లలో పథకాల పేరుతో రాష్ట్రానే దోచుకున్నారంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ కూడా ఇప్పుడు అలాంటి పథకాలనే ప్రకటించింది. రైతులకు వడ్డీ లేని పంట రుణాలు, రూ. 2 లక్షల రుణ మాఫీ, పంటలకు గిట్టుబాటు ధర సహా అనేక పథకాలు ప్రకటించి రైతులను తమవైపు లాగే ప్రయత్నం చేసింది.

వాస్తవానికి తెలంగాణలో మొత్తం వ్యవసాయ భూమి దాదాపు 1.43 కోట్ల ఎకరాలు ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 55 శాతం మంది ప్రజల వ్యవసాయాధార జీవనం సాగిస్తున్నారు. ఈ రైతులే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్దేశించనున్నారు. రైతులు ఎటువైపు తలొగ్గితే.. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం చేపట్టనుందనడంలో ఎలాంటి సందేహం. గత ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. 10 మే 2018 రోజున కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు పథకంతో రైతులంతా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. దాని ఫలితంగానే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 88 సీట్లు గెలుచుకుని ఘన విజయం సాధించింది. ఇప్పుడు కూడా ఆ రైతేలే పార్టీల జయాపజయాలను నిర్దేశించనున్న నేపథ్యంలో ప్రధానా పార్టీలు రైతులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయ్యాయి. ఈ క్రమంలో రైతులపై వరాల జల్లు కురిపిస్తున్నాయి.

రైతులకు బీఆర్ఎస్ హామీలు..

ఇప్పటికే అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు ఆ పథకాలనే విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించింది. రుణ మాఫీని కంటిన్యూ చేస్తామంది. రైతులకు ఇప్పటి వరకు ఇస్తున్న ఎకరానికి రైతుబంధు రూ. 5 వేల మొత్తాన్ని మరోసారి అధికారంలోకి వస్తే.. దశలవారీగా రూ.16 వేలకు పెంచుతామని ప్రకటించింది. ఇక రైతులకు ఇస్తున్న 24 ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామంది. అసైన్డ్‌ భూములను క్రమబద్ధీకరించి ఆంక్షలు ఎత్తివేస్తామన్నారు. అసైన్డ్‌ భూములకు హక్కులు కల్పిస్తామన్నారు. ధరణి ద్వారా భూకబ్జాలను అరికడతామని ప్రకటన.

రైతులకు కాంగ్రెస్ ప్రకటించిన హామీలు..

'రైతు భరోసా' పేరుతో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు
వ్యవసాయ కార్మికులకు రూ. 12,000
వరి క్వింటాలుకు రూ.500 బోనస్‌
వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్‌
రూ. 2 లక్షల వరకు రుణ మాఫీ
ధరణి స్థానంలో భూమాత తీసుకొస్తామని ప్రకటన.

ఈ పథకాలతో రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. అంతేకాదు.. ఈ పథకాలను జనాల్లో విస్తృతంగా తీసుకెళ్తుంది.

బీజేపీ హామీలు..

బీజేపీ కూడా రైతుల కోసం ప్రత్యేక హామీలు ప్రకటించింది. ధరణి స్థానంలో పార్దర్శకమైన 'మీ భూమి' వ్యవవ్థను తీసుకువస్తామని ప్రకటించింది. రైతును రాజు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామంది. విత్తనాల కొనుగోలుకు రూ. 2500 ఇన్‌పుట్ అసిస్టెన్స్ అందిస్తామంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామంది.

ఇలా ప్రధాని పార్టీలు రాష్ట్ర రైతాంగాన్ని తమవైపు తిప్పుకునేందుకు హామీలు గుప్పిస్తున్నాయి. మరి రైతులు.. ఈ హామీలలో వేటిని విశ్వసిస్తారు. ఏ పార్టీకి అండగా నిలబడతారు.. తెలంగాణలో తదుపరి ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది ఇప్పుడు అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Also Read: సికింద్రాబాద్‌- విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు!

Advertisment
తాజా కథనాలు