CM Revanth : మా జోలికొస్తే వీపు చింతపండే.. బీఆర్ఎస్‌కు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్!

తమ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే వీపు చింతపండు చేస్తామని సీఎం రేవంత్ అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి జోలికి పోరని, ఎవరైనా తమ జోలికొస్తే అసలే ఊరుకోమన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టడం మనందరికీ ఆనందదాయకమన్నారు సీఎం.

New Update
Arekapudi - Revanth

CM Revanth : కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తల జోలికొస్తే వీపు చింతపండు చేస్తామంటూ బీఆర్ఎస్‌ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తమ కార్యకర్తలు ఎవరి జోలికి పోరు. ఎవరైనా మా మంచి తనాన్ని చేతకానితనంగా తీసుకుంటే ఉరికిచ్చి కొడతామంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఆదివారం గాంధీభవన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. మహేష్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా పదవీబాధ్యతలు చేపట్టడం మనందరికీ ఆనందదాయకమన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని, 27 జూన్ 2021న తనను టీపీసీసీ అధ్యక్షుడుగా నియమించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 

పేదల ఇండ్లల్లో వెలుగులు నింపుతున్నాం..

7 జూలై 2021న నేను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసాం. రూ.18వేల కోట్లు 23 లక్షల రైతుల ఖాతాల్లో వేసి.. వ్యవసాయం పండగ అని నిరూపించాం. ఇదీ కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలనే నినాదంతో ఒకవైపు నేను, మరో వైపు భట్టి విక్రమార్క పల్లె పల్లెనా పాదయాత్ర చేసాం. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మొదటి రెండు గ్యారెంటీలను అమలు చేసాం. ఇప్పటి వరకు 85కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని 10లక్షలకు పెంచి పేదలకు వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ పేదల ఇండ్లల్లో వెలుగులు నింపుతున్నామని అన్నారు.

ఆ సన్నాసి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు..?

ఇక రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డలను ఆదుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతుల కళ్లలో ఆనందం చూశామని, పంద్రాగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాల్ విసిరారంటూ విమర్శుల గుప్పించారు. రాజీనామా చేస్తానని చెప్పిన ఆ సన్నాసి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు..? రాబోయే పంట నుంచి సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తాం. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని పాదయాత్రలో చెప్పాం. వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరిన్ని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. నిరుద్యోగులకు నైపుణ్యం అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దీక్ష పూనింది. త్వరలో తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. 2028లో ఒలింపిక్స్ లో దేశం తరపున బంగారు పథకాలు సాధించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. ముచ్చెర్లలో ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్లాలి. ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలంటే పూర్తి సమయాన్ని కేటాయించే పార్టీ అధ్యక్షుడు ఉండాలని అధిష్టానాన్ని కోరామని తెలిపారు.

వీపు చింతపండు చేస్తాం..

ఇక మొన్నటి ఎన్నికల్లో గెలుపు సెమీ ఫైనల్స్ మాత్రమే. 2029లో ఫైనల్స్ ఉన్నాయి. ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగరేసి రాహుల్ ను ప్రధాని చేసినప్పుడే ఫైనల్స్ గెలిచినట్లు. రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 పార్లమెంట్ స్థానాలు గెలిస్తేనే మనం ఫైనల్స్ గెలిచినట్టు. అప్పటివరకు ఎవరూ విశ్రమించొద్దు. మొన్నమొన్న కార్యకర్తలపై దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కార్యకర్తలు ఎవరి జోలికి పోరు.. ఎవరైనా మా మంచి తనాన్ని చేతకానితనంగా తీసుకుంటే వీపు చింతపండు చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక టీపీసీసీ మహేష్ గౌడ్ సౌమ్యుడు అనుకోవద్దని, ఆయన వెనకాలే తాను ఉన్నానని చెప్పారు. రాబోయే మూడు నాలుగు నెలల్లో బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మా నాయకులపై ఉందని, మీ ఎన్నికలకు మా ఎన్నికల కంటే ఎక్కువ కష్టపడతామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Advertisment
తాజా కథనాలు