CM Revanth America Tour: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి.. ప్రవాసులకు రేవంత్ పిలుపు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఆదివారం జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కు సేవలు అందించాలని ఎన్ఆర్ఐలను కోరారు.

New Update
CM Revanth America Tour: తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కండి.. ప్రవాసులకు రేవంత్ పిలుపు

రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు. న్యూజెర్సీలో ఆదివారం జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ సందర్భంగా దారిపొడవునా భారీ ర్యాలీతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుందన్నారు. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్ గా లభిస్తుందన్నారు. గత సంవత్సరం టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో అమెరికాకు వచ్చాను. పదేండ్ల పాటు సాగిన దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని చెప్పానని గుర్తు చేశారు. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానన్నారు.

ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఇప్పటికే రైతులు, మహిళలు, యువకుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీతో పాటు, ఇన్ పుట్ సబ్సిడీగా రైతు భరోసా, నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు వంట గ్యాస్ సిలిండర్, నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్తు, ఉపాధ్యాయులకు పదోన్నతులు, విద్యార్థులకు నాణ్యమైన విద్య పథకాలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ప్రారంభం మాత్రమే అని.. భవిష్యత్తు ప్రణాళికలతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.

తమ పరిపాలనపై ఎలాంటి అపోహలు, ఆందోళనలకు తావు లేదని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకు వస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి అందులో సమానమైన ప్రాధాన్యమిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ను భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతామని సీఎం ప్రకటించారు.

మీ నైపుణ్యాలు, మీ ప్రతిభా పాటవాలతో అమెరికాను పటిష్టంగా, సంపన్నంగా మార్చారని ప్రవాసులను ముఖ్యమంత్రి అభినందించారు. ఇకపై తెలంగాణకు మీ సేవలు అందించాలని స్వాగతించారు. తెలంగాణలో మెట్రో కోర్ అర్బన్ తో పాటు , సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నామని చెప్పారు.

ఈ సందర్భంగా అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ముఖ్యులతో సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ స్థాయి మాస్టర్‌ ప్లాన్ తో హైదరాబాద్ ను అత్యున్నత స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసేందుకు మీరంతా కలిసి రావాలని ప్రవాసులకు సీఎం పిలుపునిచ్చారు.


Advertisment
తాజా కథనాలు