/rtv/media/media_files/2025/10/22/vc-2025-10-22-07-10-53.jpg)
క్రీడలను ఎప్పుడూ ప్రొత్సహిస్తూ, వర్ధమాన క్రీడాకారులను తనదైన శైలిలో అభినందించే వ్యక్తిగా, క్రీడా బంధుగా గుర్తింపు పొందిన వంకిన చాముండేశ్వరనాథ్ ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ICA) 2025ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు. ఈ ఎన్నికల్లో చాముండికి రికార్డు స్థాయిలో మద్దతు లభించింది. చాముండికి 755 ఓట్లు రాగా..ప్రత్యర్థి రాజేశ్ జడేజాకు 83 మాత్రమే వచ్చాయి. మొత్తం 838 మంది క్రికెటర్లు ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ-ఓటింగ్ పద్థతిలో బుధ, గురువారాల్లో పోలింగ్ నిర్వహించారు. మహిళ క్రికెటర్లు కూడా పెద్ద ఎత్తున చాముండికి తమ మద్దతు తెలిపారు. వారందరి సపోర్ట్ తో చాముండి విజయం సాధించారు. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అత్యున్నత కమిటీ అయిన అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా తెలుగు వ్యక్తి, మాజీ రంజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్ ఎన్నికయ్యారు. ఈ చారిత్రక ఎన్నిక ద్వారా, భారత క్రికెట్ పరిపాలనలో తెలుగు క్రీడాకారుల ప్రాతినిధ్యం మరింత బలోపేతం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజమండ్రికి చెందిన చాముండేశ్వరనాథ్ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో ICA ప్రతినిధిగా ఎన్నికైన మొదటి తెలుగు వ్యక్తిగా నిలిచారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్లో చాముండేశ్వరనాథ్ మూడేళ్లపాటు కొనసాగుతారు. ఇక ఐసీఏ తరపున మహిళా క్రికెటర్ల ప్రతినిధిగా సుధా షాకు అపెక్స్ కౌన్సిల్లో చోటు దక్కగా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్కు ఐసీఏ ప్రతినిధిగా శుభాంగి దత్తాత్రేయ కులకర్ణి ఎన్నికయ్యారు.
వంకిన చాముండేశ్వరనాథ్ 1959 జూన్ 25న పుట్టారు. 1978 నుంచి 1992 మధ్య కాలంలో ఆంధ్ర జట్టుకు ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడారు. ఆంధ్ర జట్టుకు కెప్టెన్గానూ వ్యవహరించారు. ఆటతో పాటు ఆయన వ్యాపారవేత్తగా, క్రీడా నిర్వాహకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 19 సంవత్సరాల వయస్సులో ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టారు. మొత్తం14 సీజన్లలో ఆంధ్రాకు ప్రాతినిధ్యం వహించారు. 44 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన చాము 26.34 సగటుతో మొత్తం 1,818 పరుగులు చేశాడు. ఇందులో 4 శతకాలతో పాటు 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1988-89, 1990- 91 మధ్య 13 మ్యాచ్లకు ఆంధ్ర జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2009లో భారత జట్టుకు మేనేజర్గా పని చేశారు. బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్గా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో సెక్రటరీ, సెలెక్షన్ కమిటీ ఛైర్మన్, ఆంధ్ర అండర్ 19, మహిళల జట్ల సెలెక్టర్గా కూడా బాధ్యతలు చేపట్టారు. వ్యాపార వేత్త అయిన చాముండీ.. 2013లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్లో ముంబై మాస్టర్స్ జట్టుకు సునీల్ గవాస్కర్, నటుడు నాగార్జుననతో కలిసి కో ఓనర్గా ఉన్నారు. హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్తో పాటు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో జరిగిన IPL గవర్నింగ్ కౌన్సిల్కు ICA రిప్రజెంటీవ్ నామినీ కోసం జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 545 ఓట్లు పోల్ అవగా.. చాముండికి317 ఓట్లు రాగా, హర్విందర్ సింగ్ కు 228 ఓట్లు వచ్చాయి. 89 ఓట్ల తేడాతో చాముండి విజయం సాధించారు. ఐసీఏ ఎలక్టోరల్ ఆఫీసర్ ఏకే జోటి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి.
కార్లను గిఫ్ట్ గా ఇస్తూ ప్రోత్సాహం..
చాముండేశ్వరనాథ్ను సన్నిహితులు ఆయనను చాముండి అని పిలుస్తారు. దేశానికి పతకాలు సాధించిన అనేక మంది క్రీడాకారులకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి కార్లను బహుమతిగా ఇస్తూ ప్రొత్సహిస్తూ ఉంటారు. ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్లలకుBMW కార్లను బహుమతిగా ఇచ్చారు. బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్కు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కూడా ఆయన గతంలో కార్లను అందించారు. క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికే ఈ బహుమతులు ఇస్తానని ఆయన పలు సందర్భంలో వెల్లడించారు. చాముండేశ్వరనాథ్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు చాలా సన్నిహితుడు. ఈ స్నేహం కారణంగానే క్రీడాకారులకు బహుమతులు ఇచ్చే కార్యక్రమాల్లో సచిన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తుంటారు.