Rains: నైరుతు రుతుపవనాలు మే 31 (శుక్రవారం) నాటికి కేరళను తాకుతాయని వాతావరణ శాఖ ఈ నెల 15న అంచనా వేసిన సంగతి తెలిసిందే. కానీ.. రీమల్ తుఫాను కారణంగా నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరించి, ఒకరోజు ముందే.. అంటే, గురువారంనాటికే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు వాతాతవరణశాఖ శాస్త్రజ్ఞులు అంచనా వేశారు.
ఈ నేపథ్యంలోనే... ‘‘రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి’’ అని భారత వాతావరణ శాఖ బుధవారం ప్రకటించింది. ఇదే పరిస్థితి కొనసాగితే జూన్ 10లోగానే రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. అయితే.. నైరుతి రుతుపవనాల రాకకు ముందు పొడి వాతావరణం ఉంటుంది.
ఈ నేపథ్యంలో.. గురు, శుక్రవారాల్లో పగటి ఉష్ణోగ్రతలు 2–3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది.