Revanth Reddy:ఎన్నికల నగారా మోగడానికి సమయం దగ్గరపడుతుంటే అధికార పక్షాన్ని ఢీ కొట్టడానికి ప్రతిపక్షం కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. సర్కార్ ను సవాల్ చేస్తూ పలు డిక్లరేషన్ల ద్వారా ప్రజలకు దగ్గరవ్వాలని పక్కా ప్రణాళికను రెడీ చేస్తోంది. ఇప్పటికే రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్లతో ఊపు తెచ్చుకున్న టీ కాంగ్రెస్ అదే దారిలో మరిన్ని డిక్లరేషన్లను సాధ్యమైనంత త్వరలోనే విడుదల చేయడానికి కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్..!
ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చిన చేవెళ్ల సభను ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు చేపట్టడానికి టీకాంగ్రెస్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రజాగర్జన సభను నిర్వహిస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఆయనే ఈ బహిరంగ సభలో ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయనున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.
అయితే ఖమ్మం సభలాగే చేవెళ్ల సభను కూడా విజయవంతం చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ‘తిరగబడదాం..తరిమికొడదాం’ కార్యక్రమాన్ని గ్రామ గ్రామన ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ‘ప్రతీ గడపకు చేరాలి.. ప్రతీ తలుపు తట్టేలా చూడాలని’ ఆయన పిలుపునిచ్చారు. దీని కోసం పార్లమెంట్ వారీగా కో ఆర్డినేటర్లను నియమించామన్నారు.
మేనిఫెస్టో విడుదలకు సోనియా గాంధీ..!
వరుసగా డిక్లరేషన్లను విడుదల చేయాలనుకుంటున్న కాంగ్రెస్ ఈ నెల 29 న మైనార్టీ డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామన్నారు. మహిళా డిక్లరేషన్ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల రోజుల్లో కేసీఆర్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అందుకు పార్టీ శ్రేణులు శ్రమించాలన్నారు. ఇక త్వరలో విడుదల చేయబోయే మేనిఫెస్టో విడుదలకు కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి వెల్లడించారు.