అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఢిల్లీలోని ఆమె ఇంటికి హరియాణా మహిళా రైతులు విచ్చేశారు. వారితో కలిసి సరదాగా మాట్లాడుతూ ఆమె డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేస్తూ వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విడుదల చేయడంతో క్షణాల్లోనే వైరల్గా మారింది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు.
Women farmers from Haryana had expressed their desire to @RahulGandhi to see Delhi and his house. He told them that the Govt has taken away his house.
But just see what happened next.
This video is pure joy! ❤️ pic.twitter.com/1cqAeSW5xg
— Ruchira Chaturvedi (@RuchiraC) July 16, 2023
ఈనెల 8న రాహుల్ గాంధీ హరియాణా రాష్ట్రంలో పర్యటించారు. సోనపత్ జిల్లా మదీనా గ్రామంలోని పొలాల్లో మహిళా రైతులతో కలిసి నాట్లు నాటుతూ సందడి చేశారు. ఈ సమయంలో ఢిల్లీలోని రాహుల్ ఇంటిని చూడాలని వారు కోరారు. అయితే తనను ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం తన ఇంటిని తీసుకుందని ఆయన సమాధానమిచ్చారు. అనంతరం వారికి ప్రత్యేక బస్సు ఏర్పాటుచేసి సోనియా నివాసానికి ఆహ్వానించారు. సోనియా కుటుంబం ఆ రైతును సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించింది. వారితో కలిసి భోజనం చేయడంతో పాటు సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో తమతో కలిసి డ్యాన్స్ చేయాల్సిందిగా సోనియాను కోరగా అందుకు ఆమె అంగీకరించి నృత్యం చేశారు.
గతంలో హరియాణాలో రైతులతో సమావేశమైన వీడియోను రాహుల్ గాంధీ వీక్షకులతో పంచుకున్నారు. ఎంతో నిజాయితీ, సున్నిత మనస్తత్వం ఉన్న వారు మన దేశ రైతులు అని తెలిపారు. వారి కష్టాలను తెలుసుకుంటే దేశంలో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చుని పేర్కొన్నారు. ఆ వీడియోలో వారితో కలిసి నాట్లు నాటుతూ, ట్రాక్టర్ నడుపుతూ సందడి చేశారు. కాగా ప్రస్తుతం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ బెంగళూరులో జరగుతున్న విపక్షాల సమావేశానికి హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి గల ప్రణాళికలను కూటమి నేతలతో పంచుకుంటున్నారు.