స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మరోసారి సర్పంచ్ నవ్య కీలక ఆరోపణలు చేశారు. ఆర్టీవికి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో నవ్య అనేక విషయాలు వెల్లడించారు. తనకు ఈ కేసులో న్యాయం జరగలేదని.. ఎన్ని ఆధారాలు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. సమాజంలో ఈ వ్యవస్థ ఇలా ఉందా అని బాధపడ్డానని తెలిపారు. అన్యాయం జరిగినా వ్యవస్థలో న్యాయం జరగదా అని ఆవేదన వ్యక్తంచేశారు. తన లాంటి ఎంతో మంది మహిళలు బయటకు రాకుండా ఉన్నారని పేర్కొన్నారు.
అబద్ధపు కేసు పెట్టారని రాజయ్య చేసిన ఆరోపణలను నవ్య ఖండించారు. రాజయ్య వ్యవహారశైలి వల్లే తన ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు. రాజయ్యకు దమ్ముంటే తన ముందు వచ్చి మాట్లాడాలని నవ్య సవాల్ విసిరారు. తన వైపు తప్పు ఉంటే తలదించుకుని వెళ్తానన్నారు. ఇన్ని రోజులు మాట్లాడని రాజయ్య.. ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
మంచివారు యాగాలు చేస్తారు.. చెడ్డవారు యాగాలు చేస్తారన్నారు. తప్పు చేసిన వారు తాము తప్పు చేశామని ఒప్పుకుంటారా అని నవ్య తెలిపారు. వ్యక్తిగత సమస్య వ్యవస్ధ మీద పడకూడదనే కారణంతోనే రాజీకి ఒప్పుకున్నానని ఆమె భర్త వివరించారు. కేసు వాపసు తీసుకోకపోతే ఎంపీపీ కవిత ఆత్మహత్య చేసుకుంటానని వేడుకున్నారని తెలిపారు. దీంతో కొంత కాంప్రమైజ్ అయ్యానని ఆయన వెల్లడించారు.
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఎప్పుడూ ఏదొక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఈసారి రాజశ్యామల యాగం చేస్తూ మళ్లీ తెరపైకి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ స్టేషన్ ఘన్పూర్ టికెట్ దక్కి, గెలుపొందాలని ఈ యాగం చేస్తున్నారు. ఇటీవల సర్పంచ్ నవ్య అనే మహిళ పట్ల అనుచిత ప్రవర్తనతో రాజయ్య ప్రతిష్ఠ మరింత దిగజారిపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి టికెట్ డౌటే అని తెలుస్తోంది. మరోవైపు సీనియర్ నేత రాజయ్యకు రాజకీయ ప్రత్యర్థి అయిన కడియం శ్రీహరికే టికెట్ అని బీఆర్ఎస్ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజయ్య రాజశ్యామల యాగం చేస్తున్నారు. శత్రు బాధలు తొలగిపోయి, తనకు మంచి జరుగుతుందనే నమ్మకంతో ఆయన రాజశ్యామల యాగం చేస్తున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో నవ్యపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టారంటూ వ్యాఖ్యానించారు. మహిళా కమిషన్ పరిధిలో ఉన్నందునే ఇన్ని రోజులు మాట్లాడకుండా మౌనంగా ఉన్నానని స్పష్టంచేశారు.