Roja on Rishikonda: అందులో తప్పేంటి? ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ప్రశ్నల వర్షం

రుషికొండ భవనాల విషయంలో వెల్లువెత్తుతున్న ఆరోపణలపై మాజీ మంత్రి రోజా X వేదికగా స్పందించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా? అంటూ ఆమె పలు ప్రశ్నలతో కూడిన పోస్ట్ చేశారు. పనిలో పనిగా సీఎం చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేశారు.  

New Update
Roja on Rishikonda: అందులో తప్పేంటి? ప్రభుత్వంపై మాజీ మంత్రి రోజా ప్రశ్నల వర్షం

Roja on Rishikonda:  విశాఖపట్నంలో రుషికొండలో వైసీపీ హయాంలో నిర్మించిన భవనాల విషయంలో జరుగుతున్న రచ్చ తెలిసిందే. జగన్ కోసం కట్టించుకున్న ఇంద్రభవనాలు అని ప్రభుత్వం ఆరోపిస్తుంటే.. వైసీపీ మాత్రం అవి పర్యాటక భవనాలు అంటూ సమర్ధించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు ఒక్కొరొకరుగా తమ వాదన వినిపిస్తూ వస్తున్నారు. మాజీ మంత్రి అమర్ నాధ్ ఇప్పటికే మీడియా సమావేశంలో అవేవీ అక్రమ కట్టడాలు కావనీ.. వాటిని రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ లు విశాఖ వచ్చినపుడు బస చేయడం కోసం నిర్మించామని చెప్పుకుంటూ వచ్చారు. ఇక తాజాగా మాజీ పర్యాటక శాఖా మంత్రి రోజా ఈ కట్టడాల వివాదంపై స్పందించారు. పర్యాటక స్థలంలో పర్యాటక భవనాల నిర్మాణం తప్పా? అంటూ అనేక ప్రశ్నలతో కూడిన సుదీర్ఘమైన పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్  Xలో ట్వీట్ చేశారు. 

Roja on Rishikonda: ‘‘విశాఖపట్నం నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మన ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో భవనాన్ని నిర్మిస్తే తప్పేముంది?..వర్షానికి ముంపునకు గురవుతున్న అసెంబ్లీ, సచివాలయాన్ని కట్టిన వారు తట్టుకోలేకపోవడం సమంజసమా? రుషికొండలో అత్యంత నాణ్యమైన భవనాల నిర్మాణాన్ని చూడండి.  కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు పూర్తి వివరాలు అందించి 2021లో రుషికొండ నిర్మాణం చేపట్టింది నిజం కాదా?

మొత్తం 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లో ఈ నిర్మాణాలు చేపట్టాం. ఇందులో అక్రమం ఎక్కడుంది? విశాఖపట్నం గౌరవార్థం భవనాలు నిర్మించడం కూడా నేరమా? ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఫైవ్ స్టార్ సౌకర్యాలతో నిర్మాణాలు చేయడం తప్పా? మొత్తం ఏడు బ్లాకుల్లో నిర్మాణాలు, సౌకర్యాలు ఉంటాయని గతంలో టెండర్ పత్రాల్లో పొందుపరిచిన మాట వాస్తవం కాదా?

roja tweet

Roja on Rishikonda:  ఈ నిర్మాణాలపై అధికారులు ప్రతి దశలోనూ హైకోర్టుకు నివేదిక సమర్పించిన సంగతి దాగి ఉంటుందా? ఇన్నాళ్లూ ఇవి ఈ  జగనన్న సొంత భవనాలు అంటూ ప్రచారం చేస్తున్న వారు ఇప్పటికైనా ప్రభుత్వ భవనాలు అని ఒప్పుకుంటారా? గాని? హైదరాబాద్ లో సొంత ఇళ్లు కట్టుకుని, హయత్ హోటల్ కిరాయికి ప్రజల సొమ్ము లక్షలకు లక్షలు చెల్లించిన వారు... ఈరోజు విమర్శిస్తారా?

Roja on Rishikonda:  రూ.40 కోట్లతో లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఓల్డ్ సెక్రటరీ ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లను  రాత్రికి రాత్రే వదిలేసి విజయవాడకు వచ్చిన వారు ఈరోజు విమర్శిస్తారా? మా జగనన్నపై, మాపై ఎన్ని వ్యక్తిగత దాడులు చేసినా రానున్న రోజుల్లో వైసీపీ ప్రజా సమస్యలపై పోరాటానికి వెనుదిరగదంటూ  రోజా ట్వీట్ చేశారు.

మొత్తమ్మీద చూస్తుంటే, రుషికొండ పై నిర్మించిన భవనాలపై రేగుతున్న రచ్చ ఇప్పుడిపుడే చల్లారేలా కనిపించడం లేదు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ భవనాలపై వైసీపీ-టీడీపీ,జనసేన మధ్య మాటల యుద్ధం గట్టిగా సాగుతోంది. ట్వీట్ లు రీ ట్వీట్లు కామెంట్స్.. రిప్లై లతో సోషల్ మీడియా మోత మోగిపోతోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు