కరెంట్ మంటలు..
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలలే ఉండటంతో అధికార, విపక్షాల మధ్య రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తానా సభలకు అమెరికా వెళ్లిన సందర్భంగా రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కూడా చేపట్టారు. కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..
అమెరికా నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ వ్యాఖ్యలపై స్పష్టతనిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. అసలు రైతులకు ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించారని గులాబీ నేతలపై విరుచుకుపడ్డారు. ఉచిత విద్యుత్పై రేవంత్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో రేవంత్ దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. 'కాంగ్రెస్ ధికారంలోకి వస్తుంది. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తుంది. కేసీఆర్ కరెంటు అవినీతిని అంతం చేస్తుంది' అంటూ 'బైబై కేసీఆర్' అనే హ్యాష్ట్యాగ్ జత చేస్తూ కాంగ్రెస్ శ్రేణులకు కొత్త నినాదం ఇచ్చారు.
కార్యకర్తలకు రేవంత్ వార్నింగ్..
మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి గాంధీ భవన్లో ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గాంధీ భవన్ మెట్లపై ధర్నాలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని స్ఫష్టం చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు. అయితే పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉండే వినతిపత్రాలు అందజేయాలని సూచించారు. కాగా ఆలేరు నియోజకవర్గం తురకపల్లికి చెందిన కొందరు కార్యకర్తలు ఆందోళనలు చేయండంపై రేవంత్ పైవిధంగా స్పందించారు.