రమణ దీక్షితులు గుర్తున్నారా? గత టీడీపీ ప్రభుత్వంలో పింక్ డైమండ్, పోటులో తవ్వకాల ఆరోపణలతో హల్చల్ చేసిన వ్యక్తి. దీంతో తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుల పదవి పోగొట్టుకున్న ఆయన.. అప్పటి నుంచి వైసీపీకి మద్దతుగా ఉన్నారు. అయితే ఆయన తీరు మాత్రం ఎప్పుడూ వివాదస్పదంగానే ఉండేది. తాజాగా మరోసారి రమణ దీక్షితులు వార్తల్లోకి వచ్చారు. సీఎం జగన్ తనకు ఇచ్చిన హామీని మరోసారి గుర్తుచేస్తూ ట్వీట్ చేశారు. జస్టిస్ శివశంకర్ రావు కమిటీ నివేదికను అమలు చేయాలని కోరారు. టీటీడీని పగ, ప్రతీకారాలతో వంశపారంపర్య అర్చక వ్యవస్థ నాశనం చేస్తున్నారని విమర్శించారు.
పింక్ డైమండ్ అంటూ ఆరోపణలు..
గత ఎన్నికల సమయంలో పింక్ డైమండ్, పోటులో తవ్వకాల ఆరోపణలు అంటూ టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపలు చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలో వచ్చింది. అయితే ఈ నాలుగన్నరేళ్లలో ఆ ఆరోపణలను నిరూపించలేకపోయింది జగన్ సర్కార్. తప్పుడు ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు మాత్రం జగన్ మోక్షం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ప్రధాన అర్చక పదవిని ఇస్తానన్న హమీని జగన్ నెరవేర్చాలని ఎప్పటికప్పుడూ ట్వీట్స్ చేస్తూనే వస్తున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు హోదాలో ఉన్నారు. కానీ రమణదీక్షితులు మాత్రం ప్రధాన అర్చక పదవి కావాల్సిందేనని పట్టుబడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.
హామీలు సీఎం జగన్ నెరవేర్చాలని రిక్వెస్ట్..
దాంతో సమయం వచ్చినప్పుడల్లా తన అసంతృప్తిని ట్విట్టర్ రూపంలోనే వెళ్లగక్కుతూనే ఉన్నారు. తాజాగా వంశపారంపర్య అర్చకుల సమస్యకు పరిష్కారం దొరకాలని కోరుతూ ట్వీట్ చేశారు. అర్చకుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నియమించిన జస్టిస్ శివశంకర్ కమిటీ నివేదికను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలను గౌరవనీయులైన సీఎం జగన్ నెరవేర్చాలని కోరుతున్నారు.
అవకాశం దొరికినప్పుడల్లా టీటీడీపై విమ్శలు..
అర్చకుల వయోపరిమితి అంశం తీర్మానాన్ని వైవీ సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న టీటీడీ బోర్డు ఆమోదించండంతో గొల్లపల్లి వంశానికి చెందిన రమణ దీక్షితులుతో పాటు మరో మూడు కుటుంబాలకు సంబంధించిన ప్రధాన అర్చకులు రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. వారితో పాటు తిరుచానూరు, గోవిందరాజ స్వామి ఆలయానికి చెందిన మరి కొంతమంది అర్చకులు కూడా ఉద్యోగ విరమణ పొందారు. దీంతో రమణదీక్షితులు తనకు అవకాశం దొరికినప్పుడల్లా ట్విట్టర్ వేదికగా టీటీడీ అధికారులపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ ట్వీట్లలో సీఎం జగన్ను ట్యాగ్ చేస్తూ వస్తున్నారు. ఏపీలోని దేవాలయాలల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని సంచలన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి రమణదీక్షితులు తెరపైకి రావడం ఆసక్తిగా మారింది.