Revanth Reddy: స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, అంజన్ కుమార్ యాదవ్, వీహెచ్, ఇంకా జగ్గారెడ్డి తదితరులు సోమాజీగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యువతకు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదన్నారు.
ఆయనే గ్రామ పంచాయితీలను బలోపేతం చేశారన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది ఇంకా సాంకేతిక విప్లవం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీయే అని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆనాడు రాజీవ్ గాంధీ చేసిన కృషితోనే ఐటీ ఇంత అభివృద్ధి చెందిందని.. టెలికాం రంగంలో మార్పులు తెచ్చి అందరికీ అందుబాటులోకి రాజీవ్ గాంధీ తీసుకొచ్చారన్నారు. పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు.
పేదల కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబం రాజీవ్ గాంధీ గారిదన్నారు. దేశంలో విభజించు పాలించు విధానాన్ని బీజేపీ అవలంభిస్తోందన్నారు. మణిపూర్ మండుతున్నా.. ప్రధాని అక్కడ భరోసా ఇవ్వలేకపోయారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ, బీఆర్ఎస్ నాణానికి బొమ్మా, బొరుసులాంటివని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వారిద్దరిది ఫెవికాల్ బంధమన్నారు.
దేశ సంపదను మోడీ తన మిత్రులకు దోచి పెడుతుంటే... కేసీఆర్ రాష్ట్ర సంపదను తన కుటుంబ సభ్యులకు దోచి పెడుతున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పి.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నేడు ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్నారు.