Rahul Gandhi: ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం పార్టీ అభ్యర్థులు ఎక్కడ పోటీ చేయాలో బీజేపీ నిర్ణయిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే మజ్లీస్ పార్టీ పోటీ చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో రాహుల్ మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఈ మూడు పార్టీలు ఒక్కటే టీం అని వారంతా కలిసే పనిచేస్తారని విమర్శించారు. కేసీఆర్పై ఒక్క కేసు లేదని.. కేంద్రం తెచ్చిన బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు తెలిపిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే దొరల సర్కార్.. కాంగ్రెస్కు ఓటేస్తే ప్రజల సర్కార్ గెలుస్తుందని అన్నారు.
Also read: ముస్లీంల కోసం కాంగ్రెస్ ఏమీ చేయలేదు: మహమూద్ అలీ
హైదరాబాద్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, మెట్రో రైలు ప్రాజెక్టు, ఔటర్ రింగు రోడ్డు మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో ధరలు పెరిగిపోయాయని.. రూ.1200 లకు పెరిగిన గ్యాస్ సిలిండర్ను రూ.400 లకే అందిస్తామని అన్నారు. అలాగే రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున ఇస్తామని.. అలాగే యువవికాసం పథకంలో భాగంగా విద్యార్థులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. నవంబర్ 30 న పోలింగ్.. డిసెంబర్ 3 న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
Also Read: రానుంది బీఎస్పీ సర్కారే.. పెద్దపల్లిలో గెలిచేది నేనే.. దాసరి ఉష సంచలన ఇంటర్వ్యూ..!!