/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/modi-123.jpg)
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం వైట్ హౌస్ లో అధ్యక్షుడు జో బిడెన్ తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మోడీ, బిడెన్ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి..ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, పాకిస్తాన్ పేర్లను ప్రస్తావించకుండానే ఇరు దేశాలను టార్గెట్ చేస్తూ మోడీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
మానవత్వానికి వ్యతిరేకంగా ఉక్రెయిన్ యుద్ధం అని ప్రధాని పేర్కొన్నారు. యుక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరి గతంలోనూ స్పష్టంగా ఉందని, యుద్ధ మార్గాన్ని విడిచిపెట్టి చర్చలు, శాంతితో పరిష్కారం కనుగొనాలని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో రక్తపాతాన్ని ఆపాలని మోడీ అన్నారు. దౌత్యం కోసం భారత్ పిలుపునిచ్చిందనీ..ఉక్రెయిన్ శాంతి పునరుద్ధరించడానికి తాము అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి చార్టర్ నిబంధనలను కూడా ప్రధాని మోడీ గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ను అనుసరించాలని ఆయన అన్నారు. ఇందులో పరస్పర చర్చలు జరిగి..యుద్ధానికి శాంతియుత పరిష్కారం కావాలి అన్నారు. UN చార్టర్ ప్రకారం, దేశాల సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దృష్టిలో ఉంచుకుని శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని పేర్కొన్నారు. చర్చలు, శాంతి ద్వారా పరిష్కారానికి భారతదేశం ఎల్లప్పుడూ అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు. ఇందుకోసం భారత్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉందని మోడీ అన్నారు.