బైడెన్ దంపతుల ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ..ఈరోజు నుండి 24 వరకు అక్కడ పర్యటిస్తారు. 21న ప్రపంచ యోగా డే సందర్భంగా న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో 180కి పైగా దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. మోదీ యోగా కార్యక్రమంలో NRIలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నారని అక్కడి అధికారిక వర్గాలు తెలిపాయి. ఇక 22న అగ్రరాజ్యాధినేత బైడెన్తో సమావేశమవుతారు. ప్రపంచ రాజకీయాలు, రష్యా-ఉక్రెయిన్ వార్, చైనా దూకుడు, ఉగ్రవాదం, వాణిజ్యం, వాతావరణ మార్పులు వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
బైడెన్ విందుకు హాజరుకానున్న మోదీ
అనంతరం అమెరికా కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత బైడెన్ ఇస్తున్న విందుకు హాజరవుతారు ప్రధాని. ఈ స్టేట్ డిన్నర్కు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, అమెరికాలోని ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక 23న వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్లో ప్రసంగించనున్నారు మోదీ. మరోవైపు వైస్ ప్రెసిడెంట్ కమలాహారిస్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్..ప్రధాని మోదీని విందుకు ఆహ్వానించారు.
5 రోజుల పాటు అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటనలో మోదీ
ప్రధాని మోదీ జూన్ 20 నుంచి 25 వరకు అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటన లో భాగంగా ఈ రోజు అమెరికాకు చేరుకున్నారు. జూన్ 22న వాషింగ్టన్ డీసీకి వెళ్లనున్నారు. అక్కడ వైట్ హౌస్ వద్ద ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో భేటీ కానున్నారు. అధ్యక్షుడు జో బిడెన్, అతని భార్య, ప్రథమ మహిళ జిల్ బిడెన్ జూన్ 22 సాయంత్రం ప్రధానమంత్రి గౌరవార్థం విందును ఏర్పాటు చేస్తారు. జూన్ 22న యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తారు. అమెరికా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించ నుండటం ఇది రెండోసారి.
పలువురు సీఈవోలు, నిపుణులు, NRIలతో సమావేశం
ఇక తన పర్యటనలో PM మోదీ.. పలువురు సీఈవోలు, నిపుణులు, NRIలతోనూ సమావేశమవుతారు. ఆ తర్వాత రెండ్రోజుల పాటు అంటే 24,25 తేదీల్లో ఈజిప్ట్లో పర్యటిస్తారు. ఇది ఆ దేశంలో ప్రధాని మోదీ మొదటి పర్యటన. అమెరికా, ఈజిప్టుల్లో మొత్తం 5 రోజుల పాటు జరిగే మోదీ పర్యటన చారిత్రాత్మకంగా నిలిచిపోనుంది. కాగా ఈ రోజు ప్రధాని మోడీని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మర్యాద పూర్వకంగా కలిసారు. అంతే కాకుండా తాను నరేంద్ర మోడీ కి పెద్ద ఫ్యాన్ ని అని పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందని ఎలాన్ మస్క్ వాఖ్యానించారు.