PM Modi: ఎస్సీ వర్గీకరణకు మోడీ సై.. త్వరలోనే కమిటీ ఏర్పాటు..

30 ఏళ్లుగా మాదిగలు చేస్తున్న విభజన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. త్వరలోనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ప్రధాని. వర్గీకరణకు చట్టపరమైన సమస్యలు రాకుండా చూస్తామన్నారు.

New Update
PM Modi: ఎస్సీ వర్గీకరణకు మోడీ సై.. త్వరలోనే కమిటీ ఏర్పాటు..

PM Modi: 30 ఏళ్లుగా మాదిగలు చేస్తున్న విభజన పోరాటానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi). ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్న ప్రధాని మోదీ.. ఎస్సీల వర్గీకరణ కోసం త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంతేకాదు.. ఈ వర్గీకరణకు చట్టపరమైన ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. సికింద్రాబాద్‌లో మాదిగల విశ్వరూప మహాసభకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. రిజర్వేషన్ల విభజన కోసం మాదిగలు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 30 ఏళ్లుగా మంద కృష్ణ మాదిగ పోరాటం సాగిస్తున్నారని, వన్ లైఫ్-వన్ మిషన్‌లా ఆయన పోరాటం చేశారని అన్నారు. పార్టీలు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసేందుకే ఇక్కడికి వచ్చానని అన్నారు ప్రధాని మోదీ. పార్టీలు చేసిన పాపాలకు తాను క్షమాపణలు చెబుతున్నానంటూ మాదిగ సమాజిక వర్గానికి చేతులెత్తి నమస్కరించారు ప్రధాని మోదీ.

పేదరిక నిర్మూలనే తమ ప్రభుత్వ తొలి లక్ష్యంగా పేర్కొన్నారు ప్రధాని మోదీ. సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఎన్నో బలిదానాల తరువాత తెలంగాణ ఏర్పాటైందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ మాట తప్పారని విమర్శించారు మోదీ. దళితులకు దక్కాల్సిన సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారని అన్నారు. తద్వారా మాదిగ సామాజికవర్గాన్ని విస్మరించారని విమర్శించారు ప్రధాని. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్ఎస్ కాపాడలేకపోయిందన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని కేసీఆర్ చెప్పారని, ఇప్పుడు అది ఎటు పోయిందో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. దళితబంధుతో దళితులకు లాభం జరుగలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బంధువులకే లాభం జరిగిందని విమర్శించారు ప్రధాని మోదీ. రైతు రుణమాఫీ అన్నారు.. ఎంత మందికి రుణమాఫీ చేశారని ప్రశ్నించారు. తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని, అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ అందరినీ విస్మరించిందని దుయ్యబట్టారు ప్రధాని.

కొత్త రాజ్యాంగం పేరుతో కేసీఆర్ అంబేద్కర్‌ని అవమానించారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత విరోధులని, ఆ రెండు పార్టీలో దళితులు జాగ్రత్తగా ఉండాలని దళితులకు సూచించారు ప్రధాని మోదీ. దళితుడు రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేసింది బీజేపీనే అని చెప్పారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ మాత్రం ఆయన్ని అవమానించిందని ఆరోపించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా తాము ప్రతిపాదిస్తే.. కాంగ్రెస్ మాత్రం ఆమెను వ్యతిరేకించి అవమానించిందన్నారు.

మందకృష్ణ నా చిన్న తమ్ముడు..

మందకృష్ణను తన చిన్న తమ్ముడు అంటూ సంబోధించిన ప్రధాని మోదీ.. తెలంగాణలో ఇది చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు. 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఏర్పడిన ప్రభుత్వం దళితుల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందన్నారు. మాదిగల బిడ్డ బంగారు లక్ష్మణ్ నేతృత్వంలో తాను పనిశానని గుర్తు చేశారు ప్రధాని మోదీ. ఓ కార్యకర్తగా ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నారు. తెలంగాణలో దళితులకు జరుగుతున్న అన్యాయం తనను ఎంతగానో కలచివేస్తోందన్నాను. తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వారికి కాకుండా.. కేసీఆర్ ముందుగా కాంగ్రెస్‌కే ధన్యవాదాలు చెప్పారని ప్రధాని విమర్శించారు. అవకాశవాద రాజకీయాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.. పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో అంబేద్కర్ ఫోటో కూడా కాంగ్రెస్ పెట్టనివ్వలేదని ఆరోపించారు. అంబేద్కర్‌ను రెండుసార్లు గెలవకుండా చేసింది కాంగ్రెస్సే అని ఆరోపించారు.

సంచలన ఆరోపణలు..

ఇదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆప్‌ పార్టీలపై సంచలన ఆరోపణలు చేశారు ప్రధాని మోదీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవినీతికి ఆనవాళ్లుగా పేర్కొన్నారు. అవినీతి విషయంలో ఈ పార్టీలు పరస్పరం సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. ఆప్‌తో కలిపి బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడిందన్నారు ప్రధాని. అవినీతిలో ఆప్, బీఆర్ఎస్ సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. ఆప్‌తో కలిసి బీఆర్ఎస్ లిక్కర్ స్కామ్ చేసిందంటూ ఆరోపించారు ప్రధాని.

రైతులకు శుభవార్త..

ఇదే వేదికపై నుంచి తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కొంటామని తెలిపారు. బియ్యం కొనుగోళ్లకు ఎన్నికల కోడ్ అడ్డురాదని, కనీస మద్దతు ధర ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయొద్దని అన్నారు ప్రధాని.

Also Read:

ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? పార్టీల వారీగా వివరాలు..

ప్రధాన పార్టీలకు రెబల్స్ గండం.. బుజ్జగింపులు షురూ చేసిన అగ్రనేతలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు