రానున్న లోకసభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలపై తీవ్రంగా మండిపడ్డారు ప్రధాని నరేంద్రమోడీ. ప్రతిపక్షాలు ఈసారి గతం కన్నా ఎక్కువ ఆందోళనతో ఉన్నట్లు కనిపిస్తుందన్నారు. 2014లో కానీ 2019లో కానీ బీజేపీ వ్యతిరేక శక్తులు ఇంత స్థాయిలో ఆందోళనలో ఉండటం కనిపించలేదన్నారు.
ఈ సారి శత్రువులంతా కలిసికట్టుగా వస్తున్నారని…మోడీ అన్నారు. వీరంతా గతంలో ఒకరినొకరు దూషించుకునేవారని..ఇప్పుడు ఒకరికి మరొకరు సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. వారి పట్ల కోపం వద్దు జాలిచూపాలని కోరారు. భోపాల్ మంగళవారం జరిగిన సమావేశంలో బీజేపీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు మోడీ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానం:
కాగా రానున్న లోకసభ ఎన్నికల్లో బీజేపీ ఓడించాలన్న లక్ష్యంతో బీహార్ సీఎం, జేడియూ చీఫ్ నితిష్ కుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, శివసేనతోపాటు తదితర పార్టీలు ఈనెల 23న పాట్నాలో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాల ఐఖ్యత గురించి బీజేపీ కార్యకర్త ఇవాళ అడిగిన ప్రశ్నకు మోడీ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు.
లక్షల కోట్ల అవినీతి గ్యారెంటీ:
గ్యారెంటీ అనే పదాన్ని ప్రతిపక్షాలు బాగా ప్రచారం చేసుకుంటున్నాయని ప్రధాని అన్నారు. అవినీతికి గ్యారెంటీ అని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బీజేపీ కార్యకర్తలకు ఉందన్నారు. లక్షల కోట్ల అవినీతి వందశాతం గ్యారెంటీ అని ప్రజలకు బీజేపీ కార్యకర్తలకు చెప్పాల్న్నారు. కొద్దిరోజుల క్రితం ప్రతిపక్ష పార్టీలు ఫొటోలు తీసుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాయని ఈ సందర్భంగా మోడీ అన్నారు. ఈ ఫొటోను చూస్తుంటే ప్రతిఒక్కరూ రూ. 20లక్షల కోట్ల అవినీతికి పాల్పడటం గ్యారంటీ అని అర్థం అవుతుందన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ లక్షల కోట్ల అవినీతి కుంభకోణాలకు పాల్పడిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మోడీ.
కొందరు పార్టీ కోసమే జీవిస్తారు:
కొందరు వ్యక్తులు కేవలం పార్టీ కోసం మాత్రమే జీవిస్తారని మోడీ అన్నారు. తమ పార్టీకి మాత్రమే లబ్ది చేకూర్చాలని కోరుకుంటారు. అవినీతి, కమిషన్లు, కట్ మనీ నుంచి తమకు వాటా వస్తుందన్న కారణంతో ఈ విధంగా చేస్తారన్నారు. కష్టపడి పనిచేయరని..అందుకే ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారన్నారు. కుంభకోణాలకు పాల్పడటమే వారి దగ్గరున్న గ్యారెంటీ అంటూ ఫైర్ అయ్యారు. ఈ గ్యారెటీని అంగీకరించాలా వద్దా అని దేశం నిర్ణయించాలని మోడీ అన్నారు. కానీ మోడీ ఇచ్చే గ్యారెంటీ మాత్రం ఒకటి ఉందని అది ప్రతి అవినీతిపరుడిపైనా, కుంభకోణానికి పాల్పడే ప్రతిఒక్కరిపైనా చర్చ తీసుకోవడమే ఆ గ్యారెంటీ అన్నారు.