Pawan Kalyan: ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రారంభించే క్యాంటీన్లకు పేరు ఖరారు విషయంలో ఒక ఆసక్తికర చర్చ చోటుచేసుకొంది. వీటికి ఎన్టీఆర్ పేరుతో అన్నాక్యాంటీన్ల అని కొనసాగించాలా, డొక్కా సీతమ్మ పేరు కూడా జోడించాలా అనే చర్చ వచ్చింది. ఈ సందర్భంగా 2019 వరకూ ఉన్న విధంగా అన్నా కాంటీన్లు అని కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.
అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ పేరు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నిర్ణయించిన క్రమంలో క్యాంటీన్లకు ఎన్టీఆర్ పేరును కొనసాగించవచ్చని ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లారు. డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తే.. ప్రతి విద్యార్థికి సీతమ్మ గారి గొప్పదనం తెలుస్తుందని, పాఠశాల స్థాయిలో విశిష్ట వ్యక్తులు, దాతృత్వం కలిగినవారి పేర్లు మీద పథకాలు ఉండటం వల్ల భావితరాలకు మేలు కలుగుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
Also Read: అమాయకపు ముఖం పెడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరు.. పెద్దిరెడ్డిపై మంత్రి అనగాని సెటైర్లు.!
ఈ సందర్భంగా తాను పాఠశాల దశలో ఉండగా డొక్కా సీతమ్మ గురించి చదివిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. 'కంబాల కృష్ణమూర్తి రాసిన అమృత వాక్కులు అనే సంకలనాన్ని మా నాన్న ఇచ్చారు. అందులో డొక్కా సీతమ్మ దాన గుణాన్ని, ఆకలి అన్న వారికి అర్థరాత్రి వేళ కూడా వండివార్చి పెట్టేవారనీ, అంతర్వేది దర్శనానికి బయలుదేరితే.. దారిలో తన ఇంటికి భోజనానికి యాత్రికులు వస్తున్నారని తెలిసి దైవ దర్శనానికి వెళ్లకుండా వెనక్కి వచ్చి ఆకలి తీర్చారని చదివాను'.
ఆ రోజు నుంచి డొక్కా సీతమ్మ దాతృత్వ భావనలు గుర్తుకు వస్తూనే ఉంటాయని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. స్కూలు విద్యార్థులకు భోజనం అందించే పథకానికి డొక్కా సీతమ్మ పేరు ఉండటం వల్ల భావి తరాలకు విలువలు అందించగలమన్నారు. అలాగే పేదలకు కిలో రూ.2 కు బియ్యం అందించే పథకం తీసుకువచ్చిన ఎన్టీఆర్ పేరుతో అన్నా క్యాంటీన్ల నిర్వహణ సముచితమన్నారు.