Pandit Laxmikant : అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ప్రధాన పూజారి కన్నుమూత.. మోదీ, యోగి తీవ్ర దిగ్భ్రాంతి!

అయోధ్య బాల రాముడి ప్రాణ పతిష్ట చేసిన పూజారి ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ (86) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతిపై పీఎం మోదీ, యూపీ సీఎం యోగి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారణాసి మణికర్ణిక ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

New Update
Pandit Laxmikant : అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ప్రధాన పూజారి కన్నుమూత.. మోదీ, యోగి తీవ్ర దిగ్భ్రాంతి!

Ayodhya Ram Mandir: అయోధ్యలోని వేద పండితుడు, రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో (Ram Lalla Pran Pratishtha) ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ (86) మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం కాశీలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. లక్ష్మీకాంత్‌ మధురనాథ్ దీక్షిత్ పూర్వీకులు మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాకు చెందిన బ్రాహ్మణులు. కాగా వారణాసికి వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ఇక లక్ష్మీకాంత్‌ దీక్షిత్ (Pandit Laxmikant) మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కాశీ విశ్వనాథ్ ధామ్, అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నాటి జ్ఞాపకాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. సంస్కృత భాషకు, భారతీయ సంస్కృతికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో లక్ష్మీకాంత్ దీక్షిత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఈ ఏడాది జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా అయోధ్య రామాలయంలో జరిగిన శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన పూజారిగా వ్యవహరించారు. అన్ని వేదాల శాఖల నుంచి 121 మంది పండితుల బృందానికి నాయకత్వం వహించడానికి వేద 'కర్మకాండ్' (ఆచారాలు) పండితుడిని అధికారులు ఎన్నుకున్నారు. 17వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత కాశీ పండితుడు గాగా భట్‌ వంశానికి చెందిన వారు లక్ష్మీకాంత్ దీక్షిత్. గాగా భట్ 1674లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకానికి అధ్యక్షత వహించిన ప్రధాన పూజారి. వేదాలు, వైదిక ఆచారాలు, భారతీయ పురాతన సంప్రదాయాలపై పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్‌కు విశేష పరిజ్ఞానం ఉంది.

Advertisment
తాజా కథనాలు