AP News: మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలిచ్చాం.. పల్లా శ్రీనివాసరావుతో చంద్రబాబు!

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు సీఎం చంద్రబాబును కలిశారు. 'పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి మీరే. మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షునిగా కీలక బాధ్యతలిచ్చాం. పార్టీలో యువరక్తాన్ని చేర్చండి' అని బాబు సూచించారు.

New Update
AP News: మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలిచ్చాం.. పల్లా శ్రీనివాసరావుతో చంద్రబాబు!

AP News: ప్రతిపక్షంలో ఉన్నపుడు ఐదేళ్లుగా పడిన కష్టం, పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించి అతిపెద్ద బాధ్యత అప్పగించామని టీడీపీ  పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన పల్లా శ్రీనివాస్‌కు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన నేపథ్యంలో ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

యువతను పార్టీలోకి ఆహ్వానించాలి..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నమ్మకంతో అతిపెద్ద బాధ్యత నీకు అప్పగించాం. సమర్ధంగా నిర్వహించాలి. అధికారంలో ఉన్నపుడు ప్రతి కార్యకర్తను దగ్గర చేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికీ తగు గౌరవం కల్పించాలి. ప్రత్యేకంగా యువతను పార్టీలోకి ఆహ్వానించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుండి యువతను రాజకీయాల్లోకి స్వాగతించాలి. యువతతోనే సమాజంలో మార్పులు సాధ్యమవుతాయి. జాతీయ అధ్యక్షునిగా పార్టీ పరంగా, ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పరంగా అండగా ఉంటాను. నిత్యం కార్యకర్తలతో అనుసంధానమై పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలి. పార్టీ పరంగా అన్ని రకాలుగా సంపూర్ణ మద్దతు ఇస్తాను. సీనియర్ల సూచనలు, జూనియర్లు, యువత మద్దతుతో పార్టీని మరింత బలోపేతం చేయాలి. వచ్చే నెల నుండి పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ కూడా పున:ప్రారంభించాలి. వీలైనంత త్వరగా నామినేటెడ్ పదవుల్లో పని చేసిన కార్యకర్తల్ని నియమించి గౌరవించాలి. అదే సమయంలో పార్టీ కోసం పని చేసిన ప్రతి నాయకుడికీ తగిన గుర్తింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచించారు.

అందరికీ తోడుగా నిలవాలి..
అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడంపై కృతజ్ఞతలు తెలిపారు. నాకంటే పెద్ద బాధ్యత మీపై ఉంచారని నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రతి క్షణం కార్యకర్త నుండి నాయకుల వరకు అందరికీ తోడుగా నిలవాలి. కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు, నాయకులు స్తబ్దుగా ఉన్నారని, వారందరినీ యాక్టి వేట్ చేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉందని అన్నారు. పార్టీ కార్యాలయంలో మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నామని, తద్వారా ప్రతి మంత్రి కూడా నెలలో ఒక రోజు కనీసం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉండబోతున్నారని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి సముచిత న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పార్టీ అధినాయకత్వం నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని, ఏం కావాలన్నా అందించేందుకు పార్టీ సిద్ధంగా ఉందని నారా లోకేశ్ తెలిపారు.

పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడం కోసం అనునిత్యం కష్టబడతానని, సీనియర్ల సలహాలతో పార్టీకి యువరక్తం ఎక్కించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పల్లా శ్రీనివాస్ అన్నారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా చొరవ తీసుకుంటానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోనన్నారు. కష్టబడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని పల్లా శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

Advertisment
తాజా కథనాలు