చరిత్ర సృష్టించిన తెలంగాణ హైకోర్టు.. తొలిసారిగా తెలుగులో తీర్పు

తెలంగాణ హైకోర్టు సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తెలుగులో తొలి తీర్పు ఇవ్వడం ద్వారా చరిత్ర సృష్టించింది. సికింద్రాబాద్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు తొలిసారిగా తెలుగులో తీర్పును వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళ హైకోర్టు మలయాళంలో తీర్పును ఇవ్వగా.. ఆ తీర్పును అనుసరించి సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ నగేష్‌ భీమపాకలతో కూడిన ధర్మాసనం తొలిసారిగా తెలుగులో 44 పేజీల తీర్పును వెల్లడించింది. స్థానిక భాషల్లో కేరళ తరువాత తీర్పు చెప్పిన రాష్ట్రంగా తెలంగాణ హైకోర్టు నిలిచింది.

High Court : శంషాబాద్‌లోని 181 ఎకరాలు హెచ్‌ఎండీఏవి.. హైకోర్టు తీర్పు
New Update

news-the-telangana-high-court-announced-its-judgment-in-telugu-for-the-first-time

సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో మొత్తం ఇంగ్లీష్ భాషలోనే తీర్పులను ఇస్తుంటారు. పిటిషన్‌లు దాఖలు చేసినప్పుడు అనుబంధ డ్యాక్యుమెంట్లు, ఆధారాలు స్థానిక భాషలో ఉన్నప్పటికీ వాటిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లెట్ చేసి కోర్టు రిజిస్ట్రీకి ఇవ్వాలి. సుప్రీం కోర్టు కీలక తీర్పులను ఈ మధ్య స్థానిక భాషల్లోకి ట్రాన్స్‌లెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులు కూడా స్థానిక భాషలో తీర్పులు వెల్లడించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. స్థానిక భాషల ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా కోర్టులు కూడా మాతృభాష వైపు మొగ్గు చూపుతున్నాయి.

అయితే.. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలో 4 ఎకరాల స్థలం విషయంలో కె. చంద్రారెడ్డి, కె. ముత్యంరెడ్డి మధ్య వివాదం తలెత్తింది. వారి తల్లి పేరు మీద ఉన్న భూమి ఆమె బ్రతికి ఉన్న సమయంలో పంచి ఇవ్వలేదు. ఆమె మరణించిన తర్వాత ఈ భూమి గొడవకు దారితీసింది. తల్లి రాసిన వీలునామా ద్వారా భూమి మొత్తం తనకే వచ్చిందని పెద్ద కుమారుడు చంద్రారెడ్డి పేర్కొనగా.. ఆ వీలునామా చెల్లదని అందులో సగం భూమి తనదే అంటూ ముత్యంరెడ్డి సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు.విచారించిన సివిల్‌ కోర్టు తల్లి రాసిన వీలునామాలో సందేహాలున్నాయని చెప్పింది. ఆ వీలునామా చెల్లదని పేర్కొంటూ.. తల్లి ఆస్తి ఇద్దరికీ సమానంగా చెందుతుందని తీర్పుని ఇచ్చింది. కింది కోర్టు తీర్పుపై చంద్రారెడ్డి అతని వారసులు హైకోర్టులో అప్పీలు చేయగా.. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ.. కింది కోర్టు వెలువరించిన తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ చంద్రారెడ్డి పిటిషన్ ను కొట్టివేసింది.

ఈ మేరకు తెలుగులో తీర్పును వెలువరించింది. తెలుగులో తీర్పు వెలువరించటంపై ఉమ్మడి ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టులు ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెలువరించేందుకు వీలుగా పార్లమెంటు తప్పనిసరిగా చట్టం తీసుకురావాలన్నారు. ప్రాంతీయ భాషల్లో తీర్పులను వెలువరించటం ద్వారా ప్రజలకు న్యాయవ్యవస్థను మరింత చేరువ అవుతుందని అన్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe