ఆసియాకప్లో భాగంగా క్యాండీలోని పల్లెకెలె క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న భారత్-నేపాల్ మ్యాచ్ మధ్య పోరులో నేపాల్ బ్యాటింగ్ ముగిసింది. 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన నేపాల్ జట్టును భారత బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేశారు. 37.5 ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో కాసేపు మ్యాచ్ నిలిచిపోయింది. కాసేపటి తర్వాత వర్షం తగ్గడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. అప్పటికీ నేపాల్ 40 ఓవర్లకు 184 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3, మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్ తలా ఓ వికెట్ తీశారు. ఇక నేపాల్ బ్యాటర్లలో ఆసీఫ్ షేక్ 58, సోమ్పాల్ 48 పరుగులతో రాణించారు.
ఇక ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో నేపాల్ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు అర్ణ బీర్ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ మ్యాచ్లో నేపాల్ ఆటగాళ్లు తీసే ప్రతి వికెట్కు రూ.లక్ష నజరానా ఇస్తామని ప్రకటన చేసింది. అలాగే ఒక్కో సిక్సర్కు రూ.లక్ష బహుమతి, ఫోర్ కొడితే రూ.25వేలు నజరానాగా ఇస్తామని తెలిపింది. తమ ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఇలా నజరానా ప్రకటించినట్లు ఆ కంపెనీ అభిప్రాయపడింది. మరోవైపు పాక్తో ఆడిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఈ మ్యాచ్లో గెలవాల్సిన పరిస్థితి రోహిత్ సేనకు ఏర్పడింది. ఒకవేళ ఈ మ్యాచ్లో నేపాల్ గెలిస్తే టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే.