Uttar Pradesh CM Yogi Aadithya Nath: అవకాశం దొరికితే చాలు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్, పక్క దేశం పాకిస్తాన్ల మీద మండిపడతారు. తీవ్ర విమర్శలు చేస్తారు. ఈరోజు త్రిపుర అగర్తలాలో సిద్దేశ్వరి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎప్పటిలానే కాంగ్రెస్ను తిట్టిపోయడమే కాక పాకిస్తాన్ ను కూడా తీవ్రంగా దూషించారు. కాంగ్రెస్ ఒప్పందాన్ని అనుసరిస్తే...దేశాన్ని విభజిస్తారు అంటూ విమర్శలు చేశారు యోగి. దేశంలోని జాతుల సంప్రదాయాన్ని నాశనం చేస్తారని ఆర్ఎస్ఎస్కి తెలుసు అని అన్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రపంచ మానవాళికి క్యాన్సర్ లాంటిదంటూ మండిపడ్డారు. దానికి చికిత్స చేసేంత వరకు భారత సమస్యలను పరిష్కరించలేమని అన్నారు. ప్రస్తుతం పీఓకే స్వేచ్ఛగా ఉండాలని మళ్లీ భారతదేశంలో కలవాలని డిమాండ్ చేస్తోందంటూ విమర్శించారు.
అలాగే మళ్ళీ 1947 నాటి విషయాలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ మీద ఆరోపణలు చేశారు సీఎం యోగి. 1947లో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నవారు భారతదేశాన్ని విభజించాలని కోరుకునే ముస్లింలీగ్కి మద్దతు ఇచ్చారని, దీంతోనే పాకిస్తాన్ పుట్టిందని అన్నారు. 1905లో బెంగాల్ విభజించడానికి బ్రిటీష్ ప్రయత్నిస్తే.. బీజేపీ ప్రజా ఉద్యమం ద్వారా అడ్డుకుందని గొప్పలు చెప్పుకొచ్చారు. ముస్లిం లీగ్పై కూడా కాంగ్రెస్ ఇదే విధంగా వ్యతిరేకత చూపించి ఉంటే పాకిస్తాన్ సృష్టిని నిరోధించి ఉండేవాళ్లమని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న అశాంతి గురించి కూడా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. దీనికి బాధ్యులెవరో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రజలను కోరారు.
Also Read: Hockey: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో ఫైనల్స్కు భారత్