Manda Krishna Madiga: వెంటనే వర్గీకరణ అమల్లోకి.. ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ మార్చాలన్న మందకృష్ణ!

ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమల్లోకి తేవాలని మందకృష్ణ మాదిగ ప్రభుత్వాలను కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్లను ఇందుకు అనుగుణంగా సవరించాలన్నారు. విద్యాసంస్థల్లో అడ్మిషన్లను కూడా ఇలాగే చేపట్టాలన్నారు. తెలంగాణలో మాదిగలకు 12 శాతం, ఏపీలో 7 శాతం దక్కే ఛాన్స్ ఉందన్నారు.

New Update
Manda Krishna Madiga: వెంటనే వర్గీకరణ అమల్లోకి.. ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ మార్చాలన్న మందకృష్ణ!

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. తమ ఉద్యమానికి మద్దతు తెలిపిన వారందరికీ, అమరవీరులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నామంటూ భావోద్వేగానికి గురయ్యారు. అన్యాయానికి గురవుతున్న పక్షాల వైపే న్యాయవ్యవస్థ నిలబడుతుందని చెప్పడానికి ఈ తీర్పు నిదర్శనమని కొనియాడారు. ఇది న్యాయాన్ని బతికించడానికి, పేద వర్గాలకు అండగా నిలవడానికి ఇచ్చిన తీర్పుగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉందని గుర్తు చేశారు. ప్రత్యేక చొరవ తీసుకున్న ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఇతర నేతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

గతంలో వర్గీకరణ చేసింది చంద్రబాబేనని.. ఇప్పుడు తీర్పు వచ్చే సమయంలో ఉన్నది కూడా ఆయనేనన్నారు. దీంతో వర్గీకరణ అమలు ఎలాంటి అవరోధాలు లేకుండా జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. వర్గీకరణ కోసం లాయర్ ను పెట్టామని చెబుతున్న తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ సైతం తీర్పు అమలు చేయక తప్పదన్నారు. కర్ణాటకలోనూ వర్గీకరణ జరగబోతోందన్నారు.  అందుకోలేని వర్గాలకు కూడా రిజర్వేషన్లు అంది న్యాయం జరగబోతోందన్నారు. వర్గీకరణ పూర్తయ్యే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టకూడదని మందకృష్ణ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు.

పూర్తి జీవోలు వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్లను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. నోటిఫికేషన్లను సైతం సరి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్గీకరణ ప్రకారం రీనోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. విద్యాసంస్థల అడ్మిషన్లలో కూడా తక్షణమే వర్గీకరణ అమలు చేయాల్సిందేనన్నారు. లేకుంటే తమకు అన్యాయం జరుగుతుందన్నారు.త్వరలోనే విజయోత్సవ సభ నిర్వహిస్తామన్నారు.

2004లో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియపై కోర్టుకు వెళ్లకపోతే.. ఈ 20 ఏళ్లలో దళితుల ఉమ్మడి ప్రయోజనాల కోసం అనేక పోరాటాలు చేసే అవకాశం ఉండేదన్నారు.   ఇది ఒకరి గెలుపు, మరొకరి ఓటమి కాదన్నారు. ఇక నుంచి దళితుల అభ్యున్నతికి కలిసికట్టుగా పోరాటం చేద్దామని మాలలకు పిలుపునిచ్చారు మందకృష్ణ. ఈ వర్గీకరణ ఫలాలు అన్ని ఉపకులాలకు దక్కాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. వర్గీకరణతో తెలంగాణలో మాదిగలకు 11-12 శాతం రిజర్వేషన్లు దక్కే అవకాశం ఉందన్నారు. ఏపీలో 7 దాటే అవకాశం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: ప్రతిపక్షాలు చెప్పినట్లు నేను ఆడిపాడను.. కౌశిక్ రెడ్డికి పొన్నం కౌంటర్!

Advertisment
తాజా కథనాలు