భోపాల్ రాష్ట్రంలో సుమారు 20 మందిపై దాడి చేసిన రూ.21,000 రివార్డ్ ఉన్న ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని ఎట్టకేలకు నిర్బంధించారు. డ్రోన్ సహాయంతో దానిని గుర్తించిన సిబ్బంది మత్తు మందు ఇచ్చి పట్టుకుని బోనులో బంధించారు. మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్లో ఈ సంఘటన జరిగింది. ఒక కోతి మానవులకు హానికరంగా మారింది. ఇళ్లపై తిరుగుతూ పలువురిపై దాడి చేసింది. గత 15 రోజుల్లో 20 మంది స్థానికులు కోతి దాడి వల్ల గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది పిల్లలు కూడా ఉన్నారు. జనాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ కోతిని పట్టుకోవడంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది చేతులెత్తేశారు. అలాగే కోతులను పట్టుకునే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ కోతిని పట్టుకున్న వారికి రూ.21,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు.
కాగా, జిల్లా కలెక్టర్ చొరవతో ఉజ్జాయినీ అటవీ శాఖకు చెందిన రెస్క్యూ టీమ్ రాజ్గఢ్కు బుధవారం చేరుకుంది. మున్సిపల్ సిబ్బంది, స్థానికుల సహాయంతో ఆ కోతిని పట్టుకునేందుకు నాలుగు గంటలు శ్రమించారు. డ్రోన్ సహాయంతో కోతి ఎక్కడ ఉన్నదో అన్నది గుర్తించారు. అలాగే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. మగతలో ఉన్న ఆ కోతిని పట్టుకుని బోనులో బంధించారు. ఈ సందర్భంగా స్థానికులు జై శ్రీరామ్, జై భజరంగ్ దళ్ అంటూ నినాదాలు చేశారు.
మరోవైపు మత్తు వీడిన తర్వాత బోనులో బంధించిన ఆ కోతి ఆగ్రహంతో రగిలిపోయింది. బోను నుంచి బయటపడేందుకు చాలా ప్రయత్నించింది. అయితే మనుషులకు ప్రమాదకరంగా మారిన ఆ కోతిని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ శాఖకు చెందిన రెస్క్యూ సిబ్బంది తెలిపారు. కాగా, ‘మోస్ట్ వాంటెడ్’ కోతిని పట్టుకునేందుకు ప్రకటించిన రూ.21,000 రివార్డును ఆ టీమ్కు అందజేస్తామని రాజ్గఢ్ మున్సిపల్ అధికారులు వెల్లడించారు.