ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ రోజు నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశాంలో ఆయనను బీజేఎల్పీ నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఒడిశా తొలి బీజేపీ ముఖ్యమంత్రి కానున్నారు. కేవీ సింగ్ డియో, ప్రభాతి పరిదా ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. కేంద్రంలో ప్రధాని, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఈ రోజు ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపిందర్ యాదవ్ పరిశీలకులుగా హాజరయ్యారు.
పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన మోహన్ చరణ్ మాఝీని సీఎంగా బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. దీంతో ఎమ్మెల్యేలు ఆయనను బీజేఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మోహన్ చరణ్ మాఝీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒడిశాలో గత ఐదు సార్లు బీజేడీ పార్టీ వరుస విజయాలు సాధించింది. నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాటు పాలన సాగించి రికార్డు సృష్టించారు. అయితే.. ఈ సారి ఎన్నికల్లో అధికార బీజేడీ పార్టీ ఓటమి పాలవడంతో ఆయన పాలనకు బ్రేక్ పడింది. బీజేపీ పార్టీ ఈ సారి ఒడిశాలో అనూహ్య విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 147 సీట్లలో ఆ పార్టీ 78 స్థానాలను కైవసం చేసుకుంది. అధికార బీజేడీ కేవలం 51 స్థానాలకే పరిమితమైంది.