/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/MLC-Madhusudhana-Chary-jpg.webp)
Vishwakarma Jayanti:విశ్వకర్మ జాతి అభివృద్ధికి నిరంతరం కృషిచేసే, నైపుణ్యాలను అందించే సాంకేతిక జ్ఞాన నిలయంగా విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం నిలిచిపోవాలని తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్, శాసనమండలి సభ్యులు సిరికొండ మధుసూదనాచారి ఆకాంక్షించారు. ఆదివారం నాడు విశ్వకర్మ జయంతి ఉత్సవం సందర్భంగా ఉప్పల్ భగాయతులోని విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన నిర్మాణానికి వేసిన శిలాఫలకాన్ని స్పీకర్ మధుసూదనాచారి ఆవిష్కరించారు. ఈయన వెంట తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, బీసీ కమీషన్ సభ్యులు ఉపేంద్రలు ఉన్నారు.
కాగా, విశ్వకర్మ జయంతి ఉత్సవం ఉప్పల్ భగాయత్లో పదివేల మందితో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా హాజరైన సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. ఈ ఆత్మగౌరవ భవనాన్ని ఆధునిక దేవాలయంతో పోల్చారు. అట్టడుగున ఉన్న విశ్వకర్మీయులు ఉన్నత స్థానానికి ఎదగడం కోసం ముఖ్యమంత్రి ఈ భవన నిర్మాణానికి ముందుకువచ్చి భవన నిర్మాణం కొనసాగిస్తున్నారని చెప్పారు. విశ్వకర్మలకు రాజకీయాధికారాన్ని ఇవ్వడానికి కేసీఆర్ ముందుకు వచ్చారని తెలిపారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విశ్వకర్మీయుల ప్రగతి వికాసాల కోసం ఈ విశ్వభ్రాహ్మణ ఆత్మగౌరవ భవనం ఒక ఆలోచనా నిలయంగా మారాలని తెలిపారు. తెలంగాణలో నిర్మించబోయే ఈ ఆత్మగౌరవ భవనం దేశంలోని విశ్వకర్మీయులందరికీ ఒక జ్ఞానాలయంగా మారాలని చెప్పారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ ఆత్మగౌరవ భవనాన్ని సాంకేతిక ఆలోచనలు అందించే ఒక రిసెర్చ్ సెంటరుగా రూపొందించి ఆ జాతి కోసం కృషి చేసేవిధంగా నిర్మించుకోవాలన్నారు. విశ్వకర్మ జాతి నుంచి వచ్చిన మేధావుల, ఆలోచనాపరుల ఆలోచనలతో ఇది ఒక జ్ఞాన టార్చిలైటుగా వెలుగొందాలన్నారు. విశ్వకర్మ జాతి చైతన్యానికి ఈ భవనం ప్రతీకగా వెలుగొందాలన్నారు. బీసీకమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. బహుజన గొంతుకగా ఉన్న దాసోజు శ్రవణ్ ను ఎమ్మెల్సీగా నియమించినందుకు ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా బహుజన జాతుల నుంచి వచ్చిన గవర్నర్.. దాసోజు శ్రవణ్ కుమార్ ఎమ్మెల్సీ ఫైలును వెంటనే ఆమోదించి పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బీసీ కమీషన్ సభ్యులు ఉపేంద్ర మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా విశ్వకర్మీయులకు రాజకీయ ప్రాతినిథ్యం, ఛైర్మన్ పదవులు ఇచ్చి విశ్వకర్మ జాతికి ముఖ్యమంత్రి సముచితస్థానం కల్పించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని విశ్వకర్మీయుల ఔన్నత్యం కోసం, ఆ జాతి ఉన్నతి కోసం విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవభవనం జ్ఞానాలయంగా నిలిచిపోవాలని విశ్వకర్మ జాతికి చెందిన పలువురు ప్రముఖులు అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విశ్వకర్మ జాతి కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి, ఆ భవన నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టినందుకు విశ్వకర్మ జాతి పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు.
ఈ సభకు విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ ట్రస్టు చైర్మన్ లాల్ కోట వెంకటాచారి అధ్యక్షత వహించగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ ట్రస్టు కార్యదర్శి బొడ్డుపల్లి సుందర్, విశ్వకర్మ యజ్ఞం కమిటీ చైర్మన్ బలవంతాచారి, రామడుగు నరసింహాచారి, దానకర్ణాచారి, సుంకోజు కృష్ణమాచారి, కుందారం గణేష్ చారీ, రాఘవ చారీ, లక్ష్మి రామా చారీ, దుబ్బాక కిషన్ రావు, ఎర్రోజు వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:
Hyderabad: చంద్రబాబుకు మద్ధతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ర్యాలీ..!