వైసీపీ నేతలే టార్గెట్ గా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. తనను సీఎం చేయాలని ప్రజలను ఓవైపు వేడుకుంటూనే.. ఇంకోవైపు జగన్ సర్కార్ ను కూల్చేస్తానని ఘాటు విమర్శలు చేస్తున్నారు పవన్. లోకల్ లీడర్లను లక్ష్యంగా చేసుకుని అవినీతి, అక్రమాలపై నిలదీస్తున్నారు. ఈక్రమంలోనే కాకినాడ జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ.. స్థానిక లీడర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నేర సామ్రాజ్యాన్ని కూల్చేస్తానని శపథం చేశారు.
తనకు అవకాశం వస్తే గూండాలను వీధుల్లో తన్నుకుంటూ తీసుకెళ్తానని అన్నారు పవన్. జగన్ అండ చూసుకునే ద్వారంపూడి కాకినాడ జిల్లాను లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ఇంట్లో అందరూ గూండాలని తనకు తెలిసిందని చెప్పారు. ద్వారంపూడిని మరోసారి గెలవకుండా చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్రమాలు ఇవిగో అంటూ అక్కడే చదివి వినిపించారు.
పవన్ వ్యాఖ్యలపై ద్వారంపూడి స్పందించారు. పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో మీటింగ్ పెట్టలేక రూరల్ లో పెట్టాడని అన్నారు. రాజకీయ వ్యభిచారి మాటలకి తాను స్పందించాలా.. అసలు జనసేన పార్టీని ఎవరిని ఉద్ధరించడానికి పెట్టారు అని ప్రశ్నించారు. "మార్చి 14న ముఖ్యమంత్రికి అర్హుడును కాదు అన్నావు.. మూడు నెలల్లో మాట మార్చి సీఎం అవుతాను అంటున్నావు.. ప్యాకేజీ , సీట్లు బేరం కుదరకపోవడంతో రోడ్డు మీదకి వచ్చి నన్ను సీఎం చేయండి అంటున్నావు" అని పవన్ పై ఫైరయ్యారు.
తన దగ్గర 15 వేలు కోట్లు ఉంటే చంద్రబాబు ఎందుకు నిన్నే కొనేసివాడిని అని ద్వారంపూడి కౌంటర్ ఇచ్చారు. "పిచ్చిపిచ్చిగా వాగకు.. నేను తలచుకుంటే కాకినాడలో నీ బ్యానర్ కట్టనిచ్చే వాడిని కాదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ ని తరిమిస్తే అన్ని కులాలు కలుస్తాయి. చంద్రబాబుకి వచ్చేవి చివర ఎన్నికలు. ఆయన లేకపోతే నీ దుకాణం బంద్ అయిపోతుంది. దమ్ముంటే కాకినాడలో పోటీ చేయి అని పవన్ కు సవాల్ చేశారు ద్వారంపూడి.