కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం కిరీటం ఎవరికి? ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు ఏమంటున్నారు?

ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే ఎవరు సీఎం అవ్వలన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని.. ఇది వ్యక్తిలకు సంబంధించిన పార్టీ కాదన్నారు శ్రీధర్‌బాబు. ఇక బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండు ఒక్కటేనని చెప్పారు. ప్రజలకు కూడా ఈ విషయం ఎప్పుడో అర్థమైపోయిందంటూ కేసీఆర్‌కు చురకలంటించారు.

New Update
కాంగ్రెస్‌ గెలిస్తే సీఎం కిరీటం ఎవరికి?  ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు ఏమంటున్నారు?

నోరు జారరు.. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడతారు..ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు.. ఒక్క అక్షరం పొల్లు పోకుండా..వివాదాలకు దూరంగా పార్టీ హైకమాండ్‌ ఇచ్చిన పనిని సైలెంట్‌గా చేసుకుపోయే అరుదైన నాయకుల్లో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు (sridhar babu) ఒకరు. ఏఐసీసీ కార్యదర్శిగా ఓవైపు తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు ప్రజల సమస్యలను నిత్యం తెలుసుకుంటూ నియోజకవర్గంలోనూ తనదైన మార్క్‌ చూపించే ఆయన.. ఆర్టీవీ(RTV)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు.

రేవంత్‌రెడ్డిపై శ్రీధర్‌బాబు ఏమన్నారు?
రేవంత్‌రెడ్డి(revanth reddy) కాంగ్రెస్‌కు వలస వచ్చిన నాయకుడని.. ఆయన్ను టీపీసీసీ చీఫ్‌గా ఏ ప్రతిపాదికన ఎంపిక చేశారంటూ ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నిస్తుంటాయని ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు శ్రీధర్‌బాబు సమాధానం చెప్పారు. ఎవర్ని చీఫ్‌ చేయాలన్నది, ఎవర్ని సీఎం చేయాలన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని.. ఇక్కడ వ్యక్తుల ఇష్టాఇష్టాలు ఉండవని.. అంతా సమిష్టి నిర్ణయాలే ఉంటాయన్నారు శ్రీధర్‌ బాబు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలిస్తే సీఎంగా ఎవరుండాలన్నది కూడా పార్టీ హైకమాండే నిర్ణయిస్తుందని..గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకుంటారని క్లారిటీగా చెప్పారు శ్రీధర్‌బాబు.

గాంధీభవన్‌ రాజకీయాలపై ఏమన్నారంటే?
హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేలలో ఒకరైన శ్రీధర్‌బాబు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటివలి కాలంలో గాంధీభవన్‌కి కాస్త దూరంగా ఉండటానికి హైకమాండ్‌ ఇచ్చిన బాధ్యతలే కారణమని.. అంతేకానీ.. గాంధీభవన్‌ తనను దూరం పెట్టడం కానీ.. తాను గాంధీభవన్‌ని దూరం పెట్టడం కానీ జరగలేదన్నారు. కర్ణాటకలో ఓ ప్రాంతాన్ని గెలిపించే బాధ్యతలు అప్పగించడంతో కొన్నిసార్లు గాంధీభవన్‌కు రాలేకపోయానన్నారు. పార్టీ పరంగా ముఖ్యమైన ప్రతి మీటింగ్‌కి వచ్చానని చెప్పారు. తాను ఏ ఫైల్ పెట్టినా అది క్లియర్‌ అవుతుందన్న ప్రచారంలో నిజం లేదని.. అసలు తాను ఏ ఫైల్‌ పెట్టలేదన్నారు శ్రీధర్‌బాబు. నిబంధనల ప్రకారమే అన్ని పనులు జరుగుతాయన్నారు. తన నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మూడు బ్యారేజీలున్నాయని.. కానీ మా నియోజకవర్గంలో ఒక ఎకరానికి కూడా నీళ్లు రావడంలేదని చెప్పారు. ఎన్నిసార్లు నీళ్లు అడిగినా ఒక్కసారి కూడా ఇవ్వలేదని.. చాలా పోరాటాలు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే:
బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండు ఒక్కటేనంటూ హాట్ కామెంట్స్ చేశారు శ్రీధర్‌ బాబు. అందుకే INDIA కూటమి మీటింగ్‌కి బీఆర్‌ఎస్‌ని ఆహ్వనించలేదని తెలిపారు. ఫ్యూచర్‌లో కూడా బీఆర్‌ఎస్‌ని చేర్చుకోబోమని.. ఖమ్మం బహిరంగ సభలో రాహుల్‌గాంధీ కూడా ఇదే విషయాన్ని చెప్పారన్నారు. బయటకు బీజేపీని విమర్శిస్తున్నా.. ప్రజలకు మాత్రం కేసీఆర్‌, బీజేపీ ఒక్కటేనన్న విషయం అర్థమైపోయిందన్నారు శ్రీధర్‌ బాబు. ఇక షర్మిల పార్టీ గురించి ఇప్పటివరకు ఏఐసీసీలో చర్చ జరగలేదని.. అసలు డిస్కషనే జరగనప్పుడు ఆమె కలుస్తారా లేదా అన్న విషయం గురించి మాట్లాడడం అనవసరమన్నారు. అటు కాంగ్రెస్‌లో ఒకరిని చూపించి ఓటు వేయమని ప్రజలను అడగమని.. పార్టీని చూపించి ఓట్లు అడుగుతామన్నారు శ్రీధర్‌బాబు.

Advertisment
Advertisment
తాజా కథనాలు