/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Loksabha-Speaker-Election-.jpg)
రేపు జరగనున్న లోక్సభ స్పీకర్ ఎన్నిక రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. దాదాపు 50 ఏళ్ల తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. లోక్సభ స్పీకర్ కోసం చరిత్రలో రెండు సార్లు మాత్రమే ఎన్నిక జరిగింది. 1952, 1976 ఎమర్జెన్సీ టైంలో లోక్సభ స్పీకర్ కోసం ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సారి కూడా ఏకగ్రీవం కోసం ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేసింది. అయితే.. డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇస్తేనే స్పీకర్కు మద్దతిస్తామని ఇండియా కూటమి షరతు పెట్టింది. ఈ కండిషన్ కు ఎన్డీఏ అంగీకరించకపోవడంతో ఇండియా కూటమి సురేష్ కొడికున్నిల్ ను స్పీకర్ అభ్యర్థిగా బరిలోకి దించింది. తాజా మాజీ స్పీకర్ ఓంబిర్లాను ఎన్డీఏ స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరగనుంది.
VIDEO | BJP MP and NDA candidate for Speaker post, Om Birla (@ombirlakota), leaves from Parliament. pic.twitter.com/3rwSBd2BHz
— Press Trust of India (@PTI_News) June 25, 2024
చట్టం ప్రకారం సాధారణ మెజార్టీతో స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికను నిర్వహించనున్నారు. పోలైన ఓట్లలో సగానికన్నా ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి స్పీకర్ గా ఎన్నుకోబడతారు. లోక్ సభలో మొత్తం 543 స్థానాలు ఉండగా.. రాహుల్ గాంధీ రాజీనామాతో వాయనాడ్ ఖాళీగా ఉంది. దీంతో లోక్ సభలో ప్రస్తుతం 542 మంది సభ్యులు ఉన్నారు. దీంతో మేజిక్ ఫిగర్ 272. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 293 మంది, ఇండియా కూటమికి 233 మంది సభ్యులు ఉన్నారు. ఏ కూటమిలో లేని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు 16 మంది ఉన్నారు.
K Suresh submitting his nomination papers for Speaker post in presence of several top leaders from INDIA bloc. pic.twitter.com/o4Nij25KS9
— Anand Singh (@Anand_Journ) June 25, 2024
మేజిక్ ఫిగర్ కు 30కి పైగా సభ్యులు తక్కువ పడడంతో బీజేపీ ఎన్డీఏలోని ఇతర పక్షాలపై ఆధారపడాల్సిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా 16 సభ్యులున్న టీడీపీ, 12 మంది ఉన్న జేడీయూ ఎన్డీఏలో కీలకంగా మారాయి. ఈ రెండు పక్షాలు కూడా ఎప్పుడైనా ఎన్డీయేకూ హ్యాండిచ్చే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక సమయంలో ఏదైనా జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి 4 సినారియోలను పొలిటికల్ అనలిస్ట్ లు అంచానా వేస్తున్నారు. అవేంటి, వాటి ప్రకారం ఏం జరగొచ్చో చూద్దాం.
సినారియో-1:
సినారియో-1 ప్రకారం ఎన్డీఏకు ఉన్న పూర్తి మెజార్టీ ప్రకారం.. స్పీకర్ అభ్యర్థి ఓం బిర్లా ఎలాంటి అడ్డంకులు లేకుండా సునాయసంగా విజయం సాధిస్తారు. ఇప్పటికే వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపింది. ఇలా మరికొన్ని పక్షాలు కూడా మద్దతు తెలిపితే.. ఎన్డీఏ అభ్యర్థి విజయం మరింత ఈజీ అవుతుంది.
సినారియో-2:
ఒక వేళ టీడీపీ, జేడీయూ పార్టీలు బీజేపీకి ఝులక్ ఇవ్వాలని భావించి ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు తెలిపితే ఎన్డీఏ అభ్యర్థికి ఇబ్బందులు తప్పవు. వీరికి ఏ కూటమిలో లేని ఇతర 16 మంది కూడా కలిసి వస్తే.. సీన్ రివర్స్ అవుతుంది. ఇదే జరిగితే ఎన్డీఏ ఓటమి అభ్యర్థి ఓటమి పాలైనా.. ఆశ్చర్యపోక తప్పదని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు.
సినారియో-3:
తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ స్పీకర్ ఎన్నిక సంప్రదాయం ప్రకారం ఏకగ్రీవం కావాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈ రెండు పార్టీలకు కలిపి 37 మంది ఎంపీలు ఉన్నారు. ఈ రెండు పార్టీలు ప్లేట్ మార్చి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తే ఇండి కూటమికి బిగ్ షాక్ తగిలినట్లే అవుతుంది. అప్పుడు ఎన్డీఏ అభ్యర్థి సునాయసంగా.. మంచి మెజార్టీతో విజయం సాధిస్తారు. ఇదే జరిగితే ఇండియా కూటమి బలం భారీగా పడిపోతుంది. కూటమి చెల్లా చెదురవుతుంది.
సినారియో-4:
ఏ కూటమిలో లేని పార్టీలకు సంబంధించి మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. వీరు ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటిస్తారా? ఇండియా కూటమికి ప్రకటిస్తారా? అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇందులో వైసీపీకి కూడా 4 సభ్యులు ఉన్నారు. అయితే.. వైసీపీ సభ్యులు ఎన్డీఏకు మద్దతు తెలపడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కు ఆ పార్టీ సానుకూలంగా స్పందించింది. ఎన్డీఏ, ఇండి కూటమి నుంచి బలమైన పక్షాలు బయటకు వచ్చి ఈ 14 మందితో జట్టుకడితే అది కూడా కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశం ఉంది. మరో వైపు ఒక వేళ డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరిస్తే.. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.