Bhatti Vikramarka: మధిరలో ఇండస్ట్రియల్ పార్క్.. శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి

ఖమ్మంలోని ఎండపల్లి వద్ద 84 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. యువతకు ఉపాధి కలిగించి, వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నదే తమ ఆశయమన్నారు. మధిర నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు.

Bhatti Vikramarka: మధిరలో ఇండస్ట్రియల్ పార్క్.. శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి
New Update

మధిర నియోజక వర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడం దశాబ్దాల కల అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నేడు తన సొంత నియోజకవర్గం మధిరలోని ఎండపల్లి వద్ద 84 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న సూక్ష్మ చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమల (MSME) ఇండస్ట్రియల్ పార్కు కు శంకుస్థాపన చేశారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ఆధ్వర్యంలో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ.. గ్రామాల్లోని యువతకు ఉపాధి కలిగించి, వారు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనే ఆశయంతో ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

స్వయం సహాయక సంఘాల మహిళలకు అన్ని రకాలుగా సేవలందించి వారిని పారిశ్రామిక రంగంలో ప్రోత్సహిస్తామన్నారు. చదువులు, ఉపాధి కోసం మధిర నుంచి ఖమ్మం, హైదరాబాద్, మరియు ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి స్థిరపడుతున్నారన్నారు. వారు స్థానికంగా ఇక్కడే ఉండేలా అన్ని రకాల వసతులు కల్పిస్తామని ప్రకటించారు. మధిర విద్యా, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు ఒక కేంద్రంగా మారనుందన్నారు.

సొంత నియోజకవర్గం మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. మధిర మండలం మునగాల (క్రిష్ణాపురం)నుండి నక్కలగరుబు వరకు రూ.2.70 కోట్ల నిధులతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భట్టి విక్రమార్కను ఎద్దులబండి పైన తీసుకెళ్తూ పూలవర్షం కురిపించారు.



#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe