/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Manish-Sisodia.jpg)
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆయన భార్య, మరికొందరు నిందితులకు సంబంధించిన రూ.52 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అటాచ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఇతర స్థిరాస్తులను (రూ. 7.29 కోట్లు) అటాచ్మెంట్ చేసేందుకు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈడీ ఆర్డర్ ప్రకారం...మనీష్ సిసోడియా, అతని భార్య సీమా సిసోడియాకు సంబంధించిన రెండు ఆస్తులు, మరొక నిందితుడు రాజేష్ జోషి (చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్) కు చెందిన భూమి/ఫ్లాట్, గౌతమ్ మల్హోత్రా భూమి/ఫ్లాట్ లను ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో మనీష్ సిసోడియా బ్యాంకు డిపాజిట్లు రూ. 11.49 లక్షలు, బ్రిండ్కో సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ (రూ. 16.45 కోట్లు), రూ. 44.29 కోట్ల విలువైన చరాస్తులు కూడా ఉన్నాయని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.52.24 కోట్లు అని ఈడీ తెలిపింది.
ఈ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను మార్చిలో ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వ 2021-22 ఎక్సైజ్ పాలసీకి లంచం ఇచ్చిన కొందరు మద్యం డీలర్లకు అనుకూలంగా ఉందని ED, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఆరోపించాయి. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆరోపణలను ఖండించింది. ఈ విధానం తర్వాత రద్దు చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. దీని తర్వాత ED PMLA కింద కేసు నమోదు చేసింది.
కాగా దినేష్ అరోరాను అరెస్టు చేసిన తర్వాత రోజే ఈడీ ఈ చర్యకు పాల్పడటం సంచలనంగా మారింది. దినేశ్ అరోరా ఇచ్చిన సమాచారంతోనే ఈ ఆస్తులు అటాచ్ చేసినట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.