ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న భీకర దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ మిలిటెంట్లు చేపట్టిన దాడిలో మెజారిటీ పాలస్తీనియన్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వారు చేసిన దాడుల వల్ల ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన ట్విట్టర్లో పోస్టు పెట్టారు. గత వారం హమాస్ దాడులు ప్రారంభమైన అనంతరం ఇజ్రాయెల్కు అండగా ఉంటామని బైడెన్ ప్రకటన చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇజ్రాయెల్పై జరిగిన దాడులను శత్రువులెవరూ వినియోగించుకోవద్దని ఈ సందర్భంలో హెచ్చరికలు చేశారు. అప్పటి నుంచి హమాస్ మిలిటెంట్లతో పోరాడేందుకు బైడెన్ సహాయ సహకారాలను అందిస్తూ వస్తున్నారు. మరోవైపు అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ కూడా తన ఇజ్రాయెల్ పర్యటనలో ఇదే విధమైన మద్దతును ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ పూర్తైన అనంతరం అమెరికా ఉనికిలో ఉన్నంత వరకు మేము మీ వైపే ఉంటామని చెప్పారు.
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ హమాస్తో పోరాటం చేసేందుకు అమెరికా తమ రెండో నావల్ స్ట్రైక్ గ్రూప్ను పంపించడానికి ప్రణాళిక రచిస్తున్నట్లు అసోసియేట్ ప్రెస్ నివేదికను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘యూఎస్ఎస్ డ్వైట్ డి ఐసన్ హోవర్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్’ను తూర్పు మధ్యధరా ప్రాంతానికి పంపించనున్నారు. మరోవైపు అమెరికన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ‘యూఎస్స్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్’ ఇప్పటికే ఇజ్రాయెల్కు దగ్గరగా వెళ్లింది. భూ, వాయు, సముద్ర మార్గాల గుండా ఇజ్రాయెల్ దళాలు గాజాపై దాడికి సిద్ధమవుతున్న తరుణంలో జో బైడెన్ ఇలా తాజాగా ప్రకటన చేశారు.
Also Read: ఆగని భీకర యుద్ధం.. మానవతా సంక్షోభం నివారణకై అమెరికా ప్రయత్నాలు
మరోవైపు గాజాలో తలదాచుకున్నటువంటి ఉగ్రవాదులను అంతం చేయడానికి గాజా పౌరులు వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఇది వరకే హెచ్చరికలు చేసింది. ఈ నేపథ్యంలో పాలస్తీనా ప్రజలకు, అలాగే గాజా పౌరులకు అత్యవసరంగా అవసరమైన మానవతా సాయం అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని జో బైడెన్ పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్కు తెలిపారు. మరోవైపు అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ కూడా మధ్యప్రాచ్యంలో దౌత్య చర్చలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్ పౌరుల ప్రాణాలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని పలు దేశాధినేతలను కోరుతున్నారు.