APSRTC సర్వీస్ లో ఉండగా ఉద్యోగులు ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబం రోడ్డున పడకుండా ఉండడం కోసం కారుణ్య నియామకాలను చేపడుతుంటాయి ప్రభుత్వ సంస్థలు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఆదుకుంటాయి. ఈ క్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ తమ ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలను ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జూనియర్ అసిస్టెంట్, ఆర్టీసీ కానిస్టేబుల్, మెకానిక్, కండక్టర్, డ్రైవర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం ఔదార్యంతో ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలను చేపడుతున్నట్లు ఆర్టీసీ ఎండీ వెల్లడించారు. ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేసిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వనుంది. తల్లిదండ్రులను పోగొట్టుకుని కష్టాల్లో ఉన్న ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని APSRTC నిర్ణయించింది.
ఈ మేరకు APSRTC ఎండీ ద్వారకా తిరుమలరావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కారుణ్య నియామకాలు భర్తీ ప్రక్రియ చేపట్టామని అన్నారు. కారుణ్య నియామకాల కింద 34 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 99 ఆర్టీసీ కానిస్టేబుల్ పోస్టులు, 99 అసిస్టెంట్ మెకానిక్ పోస్టులు, 61 కండక్టర్ పోస్టులు, ఒక డ్రైవర్ పోస్టును భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 2016 జనవరి నుంచి 2019 డిసెంబర్ మధ్య కాలంలో చనిపోయిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తున్నట్లు వెల్లడించారు.
కారుణ్య నియామకాల్లో భగంగా 294 మందికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే APSRTC విద్యాధరపురం ట్రాన్స్ పోర్ట్ అకాడమీలో ఉద్యోగాలు పొందిన వారికి శిక్షణ తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు హాజరయ్యారు. ఉద్యోగులు క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయాలని అన్నారు. ఉద్యోగాలు పొందిన వారికి 3 నెలల పాటు శిక్షణ ఉంటుందని.. శిక్షణా కాలంలో స్టైఫండ్ ఇవ్వనున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ బ్రహ్మానంద రెడ్డి వెల్లడించారు.