తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్దిరెడ్డి ఇంటి కాంపౌండ్ నుండి పబ్లిక్ రోడ్డు నిర్మాణం చేపట్టాడని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పబ్లిక్ రోడ్డుకు గేట్లు ఏర్పాటు చేసుకున్నట్లు వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి ఇంటి గేటును బద్దలు కొట్టడానికి జనసేన నేత కిరణ్ రాయల్ సిద్ధమయ్యారు. గేటును బద్దలు కొట్టకుండా కిరణ్ రాయల్ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటీవల ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైనప్పటి నుంచి పెద్దిరెడ్డికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎర్రచందనం స్మగ్లింగ్, మైనింగ్ లో అవకతవకలు తదితర వరుస ఆరోపణలు ఆయనను చుట్టుముడుతున్నాయి.
పుంగనూరు మున్సిపల్ చైర్మన్ సైతం వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. మరోవైపు పెద్దిరెడ్డిపై పాత కేసులను కూడా పోలీసులు తిరగదోడుతున్నారు. దీంతో ఆయన అనుచరుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డి అత్యంత కీలకంగా వ్యవహరించారు. మంత్రివర్గంలో జగన్ తర్వాత ఆయన నంబర్.2గా వ్యవహరించారన్న టాక్ ఉంది. ఇంకా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన పవర్ సెంటర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో టీడీపీ నేతలు, శ్రేణులపై దారుణంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఏకంగా చంద్రబాబు మీదే ఆయన కేసులు పెట్టించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ప్రభుత్వం ఆయన గత వ్యవహారాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈ రోజు అవనిగడ్డ వద్ద మైనింగ్ శాఖకు చెందిన ఫైళ్లను తగలబెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన వెనక కూడా పెద్దిరెడ్డే ఉన్నాడంటూ ప్రభుత్వం అనుమానిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలకు సంబంధించి ఆధారాలను చెరిపేందుకే ఆయన ఈ కార్యక్రమానికి ఒడిగట్టాడని చెబుతున్నారు.