వైసీపీపై జనసేన వార్, జగనన్న కాలనీలపై సోషల్ మీడియా క్యాంపైన్

ఏపీలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. సీఎం జగన్‌ పాలనపై తరుచూ విమర్శలు చేసే సేనాని పవన్ కల్యాణ్ తాజాగా భారీ వర్షాల నేపథ్యంలో జనసైనికులకు డిజిటల్ క్యాంపెయిన్‌కు పిలుపునిచ్చారు. జగనన్న కాలనీల ప్రస్తుత పరిస్థితిపై ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని సూచించారు.

New Update
వైసీపీపై జనసేన వార్, జగనన్న కాలనీలపై సోషల్ మీడియా క్యాంపైన్

జగనన్న కాలనీల దుస్థితిపై క్యాంపెయిన్..

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల విమర్శలతో పొలిటికల్‌ హీట్ పెరుగుతోంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్‌ పాలనపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి బలంగా తీసుకుపోతున్నారు. తాజాగా రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల పరిస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్‌కు పవన్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీలను సందర్శించి, అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయాలని సూచించారు. ఈ పోస్టులో FailureofJaganannacolony అనే హ్యాష్ ట్యాగ్ ఉండాలని తెలిపారు.

పోస్టులతో జనసైనికుల రచ్చ..

దీంతో రంగంలోకి దిగిన జనసైనికులు జగనన్న కాలనీలను సందర్శిస్తున్నారు. గుంటూరు జిల్లా తాటికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలో ప్రస్తుతం జగనన్న కాలనీ దుస్థితి అంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఈ పోస్టులో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ను టార్గెట్ చేశారు. అలాగే ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం జగనన్న కాలనీ దుస్థితిని వీడియో తీసి పోస్ట్ చేశారు జనసైనికులు. టెక్కలి నియోజకవర్గం, శ్రీకాళహస్తి నియోజకవర్గం, మదనపల్లి నియోజకవర్గం వంటి ప్రాంతాల్లోని జగనన్న కాలనీలను సందర్శించి అక్కడి పరిస్థితిని పోస్ట్ చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా క్యాంపెయిన్ చేపట్టి పోస్టుల మీద పోస్టులు చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో శనివారం జనసైనికులు ఎంత రచ్చచేస్తారో వేచి చూడాలి.

పోస్టులు చేసే వారికి సూచనలు..

పోస్టులు చేసే వారికి సూచనలను కూడా జనసేన అందజేసింది. కనీసం ఒక నిమిషం నిడివి కలిగిన వీడియో తీయాలని అక్కడి పరిస్థితులు కళ్లకు కట్టేలా ఫోటోలు ఉండాలని తెలిపింది. సోషల్ మీడియా పోస్టులో కచ్చితంగా FailureofJaganannacolony హ్యాష్ ట్యాగ్ ఉండాలని వెల్లడించింది. మీ వివరాలతో పాటు సోషల్ మీడియా లింక్స్, నాలుగు ఫోటోలు, నిమిషం వీడియోను పార్టీ కేంద్ర కార్యాలయానికి కూడా పంపించాలని సూచించింది. వివరాల్లో పేరు, పార్టీ పదవి, నియోజకవర్గం, మండలం, గ్రామం వివరాలు ఉండాలని పేర్కొంది. అలాగే 6304900820 లేదా 6304900819 నెంబర్లకు వాట్సాప్ కూడా చేయవచ్చని చెప్పింది. మొత్తానికి వైసీపీ ప్రభుత్వ పాలనను పవన్ కల్యాణ్ అన్ని మార్గాల ద్వారా టార్గెట్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు