Jahnavi Death: అమెరికాలో తెలుగు యువతి కందుల జాహ్నవి మృతిపై అక్కడి పోలీసులు అసభ్య పదజాలం వాడిన ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. తాజాగా ఈ ఘటనను ఖండిస్తూ ఏపీ సీఎం జగన్ విదేశాంగ మంత్రి జైశంకర్కు లేఖ రాశారు. కందుల జాహ్నవి మృతిపై యూఎస్ పోలీసులు కామెంట్లు చేయడం దారుణమని.. అమాయక యువతి మరణాన్ని అపహాస్యం చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అమెరికాలో చదువుకునే భారతీయ విద్యార్థుల్లో ధైర్యం కల్పించాలంటే... తప్పు చేసిన పోలీసు అధికారిపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ కేసును పూర్తిగా దర్యాప్తు చేయించాలని అభ్యర్థించారు. నిజాలను బయటకు తీసుకొచ్చి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. తక్షణమే భారత్లోని అమెరికా రాయబారితో సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సూచించాలని జగన్ మన్నవి చేశారు.
ఇప్పటికే ఈ దారుణ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. జాహ్నవి మృతి పట్ల సియాటెల్ పోలీస్ ఆఫీసర్ చేసిన కామెంట్లు దారుణంగా ఉన్నాయని ట్వీట్ చేశారు. అమెరికా పోలీసులు వ్యవహరించిన తీరు తనను కలచివేసిందన్నారు. దీనిపై అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి జాహ్నవి కుటుంబానికి న్యాయం చేయాలని ఇండియాలోని అమెరికన్ ఎంబసీని విజ్ఞప్తి చేశారు. జాహ్నవి మృతిపై స్వంత్రత్ర దర్యాప్తును జరిపించేలా అక్కడి యంత్రాంగాన్ని కోరాలని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ను అభ్యర్థించారు. ఎన్నో కలలతో, ఉన్నత లక్ష్యాలతో అమెరికా వెళ్లిన యువతి ఇలా అర్థాంతరంగా చనిపోవడం బాధాకరమన్నారు. అలాంటిది యువతి మరణాన్ని కూడా అక్కడి పోలీసులు చులకన చేయడం చాలా బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు ఏం జరిగిందంటే.. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి ఈ ఏడాది జనవరిలో రోడ్డు దాటుతుండగా పోలీస్ వాహనం ఢీకొని మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే వాహనంలో ఉన్న పోలీస్ అధికారి ఆమె మృతిని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. చనిపోయిన వ్యక్తి సాధారణ వ్యక్తి అని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు కెమెరాలో రికార్డు అయ్యాయి. తాజాగా ఈ దృశ్యాలు బయటకు రావడంతో ఆ పోలీసు అధికారి తీరుపై అమెరికాలో పెద్ద రుమారం రేగుతోంది. జాహ్నవి మృతిపై పోలీసులు స్పందించిన తీరుపై ప్రవాస భారతీయులు, నెటిజన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీంతో సదరు పోలీసు అధికారి, సహ ఉద్యోగిపై సియాటెల్ పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది.