తృటిలో తప్పించుకున్న ప్లేయర్..
శ్రీలంక వేదికగా లంక ప్రీమియర్ లీగ్-2023 ఎడిషన్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచుల్లో ఆటగాళ్లు, చీర్ గార్ల్స్ కంటే పాములు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతున్నాయి. మీరే కాదు మేము కూడా క్రికెట్ ఆడతామనే రీతిలో గ్రౌండ్లోకి వచ్చేస్తున్నాయి. ఈ లీగ్లో భాగంగా శనివారం కొలోంబోలోని ప్రేమదాస స్టేడియంలో జాఫ్నా కింగ్స్, బి లవ్ క్యాండీ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ మధ్యలో ఓ పెద్ద పాము మైదానంలో పాకుంటూ హల్చల్ చేసింది. నువాన్ ప్రదీప్ బౌలింగ్ వేస్తుండగా బి లవ్ క్యాండీ ప్లేయర్ ఇసురు ఉదాన ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో ఓ పాము ఉదాన పక్కన నుంచి వెళ్లింది. ఇది చూసిన ఉదాన ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. చూసి ఉండకపోతే పాము మీద కాలు వేసేవాడు.. అనుకోని ప్రమాదం జరిగి ఉండేది.
మైదానంలో పాములు హల్ చల్..
అనంతరం గ్రౌండ్ నుంచి వెళ్లిపోయిన పాము.. బౌండరీ లైన్ దగ్గర ఉన్న కెమెరాల వద్దకు వెళ్లింది. అలాగే జులై 31న జరిగిన దంబుల్లా ఔరా, గాలే టైటాన్స్ మ్యాచ్ సందర్భంలోనూ స్టేడియంలో పాము అందరినీ హడలెత్తించింది. ఎప్పుడు ఎటు నుంచి పాములు వస్తాయోనని ఆటగాళ్లతో పాటు సిబ్బంది హడలిపోత్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. లంక ప్రీమియర్ లీగ్ కాస్తా పాముల ప్రీమియర్ లీగ్గా మారిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 17 దాకా ఆసియా కప్ 2023 టోర్నీ శ్రీలంక వేదికగా జరగనుంది. ఫైనల్ మ్యాచుతో సహా ఇండియా, శ్రీలంక ఆడే మ్యాచ్లు లంకలోనే జరగనున్నాయి. దీంతో పాములు గ్రౌండ్స్లోకి రాకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన క్యాండీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జాఫ్నా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 170 పరుగులే చేసి ఓటమిపాలైంది.