Israel: లెబ‌నాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 492 మంది మృతి..!

లెబనాన్‌ లోని హెజ్బొల్లాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక దాడులకు తెగబడుతుంది.గడిచిన 24 గంటల్లో దాడుల్లో 492 మంది లెబనాన్ ప్రజలు మృతి చెందారు.

New Update
lebanan

Israel: లెబనాన్‌ లోని హెజ్బొల్లాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్‌ సైన్యం వైమానికి దాడులకు తెగబడుతుంది. దీంతో పశ్చిమాసియాలో ఇప్పటి వరకు గాజాకు పరిమితమైన హమాస్ – ఇజ్రాయెల్ పోరు ఇప్పుడు లెబనాన్ వైపునకు మళ్లింది. దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర స్థాయిలో వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. 

సైదా, మరజయాన్, టైర్, జహరానితో బైకా లోయలోని జిల్లాలపై యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో లెబనాన్ అంతటా 1300 హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు దిగుతుంది. దీంతో వందలాది మంది మరణించగా.. వేల మంది క్షతగాత్రులయ్యారు. లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 492 మంది లెబనాన్ ప్రజలు మృతి చెందారు.

వీరిలో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. 1500 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడులతో దక్షిణ లెబనాన్ లోని గ్రామాలు వణికిపోయాయి. వేలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాహనాల్లో బీరుట్ వైపు పారిపోతున్నారు.  దీంతో రాజధానికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం లెబనాన్ రాజధాని బీరూట్ ను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతుంది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్, బెకా వ్యాలీలో కేంద్రీకృమైందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది.

 లెబనాన్ లోని హెజ్బొల్లాకు వ్యతిరేకంగా జరుగుతున్న వైమానిక దాడుల కారణంగా లెబనాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిని తీవ్రంగా పరిగణించాలని ఆయన లెబనాన్ ప్రజలకు సూచించారు.లెబనాన్ లో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య పెరుగుతున్న వైమానిక దాడులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. 

లెబనాన్ లో ఉద్రిక్తత పెరగడం, కమ్యూనికేషన్ పరికరాలు, పేజర్లపై దాడులు, తర్వాత రెండు వైపుల నుంచి రాకెట్ దాడులు జరగడంపై తాము చాలా ఆందోళన చెందుతున్నామని యూఎన్ మానవ హక్కుల విభాగం ప్రతినిధి తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు