International Labor Day 2024 : నేడే మేడే.. ఈ కార్మికుల దినోత్సవ చరిత్ర ఇదే!

రోజుకు 8 గంటల పని వేళలు.. ఇప్పుడు మనం అనుసరిస్తున్న పని విధానం ఇది.. అయితే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.. రోజంతా వెట్టి చాకిరి..శ్రమదోపిడి.. దాదాపు 16 గంటలకు పైగా పని వేళలు.. మరి ఈ 8 గంటల పని విధానం ఎలా అమల్లోకి వచ్చింది? తెలియాలంటే ఈ ఆర్టికల్‌ చదివేయండి!

New Update
International Labor Day 2024 : నేడే మేడే.. ఈ కార్మికుల దినోత్సవ చరిత్ర ఇదే!

1st May Day 2024 : రోజుకు 8 గంటల పని వేళలు.. ఇప్పుడు మనం అనుసరిస్తున్న పని విధానం ఇది.. అయితే ఒకప్పుడు ఇలా ఉండేది కాదు.. రోజంతా వెట్టి చాకిరి.. శ్రమదోపిడి.. దాదాపు 16 గంటలకు పైగా పని వేళలు.. మరి ఈ 8 గంటల పని విధానం ఎలా అమల్లోకి వచ్చింది? ఇది సాధారణంగా జరిగిపోయిన విషయం కాదు.. ఆనాటి పాలకుల మెడలు వంచి పని గంటల హక్కును సాధించుకున్నారు కార్మికులు. ఒకవైపు రక్తం చిందుతుంటే, మరోవైపు ఆ రక్తంలో తడిచిన చొక్కాలనే తమ పోరాటానికి చిహ్నంగా ఎర్ర జెండాగా పైకెత్తి చూపారు నాటి కార్మికోద్యమ వీరులు. అలా కార్మికుల పోరాటాల్లో నుంచి పుట్టిందే 'మే డే..'! ప్రతీఏడాది మే 1న జరుపుకునే కార్మికుల దినోత్సవం గురించి.. నాటి కార్మికుల త్యాగాల గురించి ఇవాళ తెలుసుకుందాం!

మే డే(May Day) ఏదో ఒక రోజున యాధృచ్చికంగా ఏర్పడింది కాదు. ఒక చారిత్రక పరిణామ క్రమంలో కార్మికవర్గం దోపిడీ, పీడన, అణచివేతలపై జరిపిన దీర్ఘకాల పోరాటాల నుంచి ఆవిర్భవించింది. 1886 మే 1న అమెరికాలో కార్మికుల ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమంలో అమెరికా కార్మికులు వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం తమ గళాన్ని వినిపించారు. రోజుకు 15 గంటల పని వేళలను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. ఉద్యమ సమయంలో పోలీసులు కార్మికులపై కాల్పులు జరపడంతో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు.

ఈ ఉద్యమం తర్వాత మూడు సంవత్సరాలకు అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్‌(International Socialist Conference) సమావేశమైంది. ఇందులో ప్రతి కూలీ రోజుకు 8 గంటలు మాత్రమే పని చేయాలని నిర్ణయించారు. ఈ సదస్సులోనే మే 1న కార్మిక దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదన చేశారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం మే 1న సెలవు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. చికాగో అమరవీరుల సంస్మరణ దినంగా చరిత్రకెక్కిన మే ఒకటి కార్మిక దినోత్సవంగా నిలిచిపోయింది. ఈ ఉద్యమం ప్రాదేశిక సరిహద్దులు దాటి ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించి చివరకు శ్రామిక విజయానికి చిహ్నంగా రోజుకు 8 గంటల పని చట్టబద్దం చేశారు. నిజానికి అమెరికాలో మాత్రమే ఉన్న ఎనిమిది గంటల పనిదినాల నిబంధన తర్వాత చాలా దేశాల్లో అమలులోకి వచ్చింది. ఇప్పుడు మనం ఫాలో అవుతున్న పనిదినాల నిబంధన కూడా ఇదే!

దేశంలో 1923 మే 1న చెన్నైలో కార్మిక దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ అధ్యక్షతన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి పలు సంఘాలు, సామాజిక పార్టీల మద్దతు లభించింది. కార్మికులపై జరుగుతున్న దౌర్జన్యాలకు, దోపిడీకి వ్యతిరేకంగా గళం విప్పారు. వామపక్షాలు దీనికి నాయకత్వం వహించాయి.

దేశానికి కర్షకుడి అవసరం ఎంత ఉందో కార్మికుడి అవసరం కూడా అంతే ఉంది. అభివృద్దిలో కార్మిక రంగానిది కీలక పాత్ర. శ్రీ శ్రీ అన్నట్లు శ్రమకు మించిన ఆయుధం లేదు..శ్రమ శక్తి లేనిదే ఏ దేశ అభివృద్ధి జరగదు. అందుకే శ్రమను గౌరవించాలి, గుర్తించాలి.. అయితే కార్మికుల కష్టానికి ప్రతిఫలం దక్కడం లేదన్న విమర్శలు ఏళ్ల నాటి నుంచి వినిపిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమానికి ప్రవేశపెడుతున్న చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటంతో ఆ ఫలాలు వారి దరికి చేరడం లేదన్న వాదన ఉంది. ఇదంతా కేవలం కొన్ని రంగల్లో ఉందనకుంటే పొరపాటే.. ఐటీ రంగంలోనూ ఇది కనిపిస్తుంది. ఇలా మార్కెట్‌ ‌శక్తుల ద్వారా శ్రమ దోపిడీ నానాటికీ పెట్రేగిపోతున్నది.

పనిభారం, పనిగంటల పెరుగుదల, స్వదేశీ, విదేశీ బడా కార్పొరేటు ఆర్థిక శక్తుల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాల సవరణ జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. నిజానికి కాంట్రాక్టు, పార్ట్‌టైం, ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగస్తులకు కార్మిక చట్టాల నియమాలు వర్తిస్తున్నాయానన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే దుస్థితి కనిపిస్తుందన్న వాదన ఉంది. పరిస్థితిని చూస్తుంటే మళ్లీ మేడే ఆవిర్భావం నాటి పరిస్థితులు పునరావృతమవుతున్నాయనన్న ప్రశ్నలు వినిపిస్తోంది. అలా జరగకూడదు. మన పూర్వీకులు రక్తం చిందించి సాధించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. సరళీకృత ఆర్ధిక విధానాల్లో మార్పు రాకుండా పరిస్థితుల్లో మార్పు రాదు. విధానాల మార్పుకై కార్మికులతో పాటు శ్రామిక ప్రజలంతా మేడే స్ఫూర్తితో ముందుకు సాగాల్సి ఉంటుంది.

Also read: మారేడు రసం చేసే మేలేంతో కీడు కూడా అంతే!

Advertisment
తాజా కథనాలు